అభివృద్ధికి రాజమార్గం

1 Aug, 2020 13:34 IST|Sakshi
వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా కేక్‌ కట్‌ చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు

పరిపాలన వికేంద్రీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌     

బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్‌ 

జిల్లాకు మరిన్ని వనరులు     

అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం లక్ష్యం 

మూడు రాజధానుల ఏర్పాటుకు గవర్నర్‌ ఆమోదముద్ర వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అన్ని ప్రాంతాలకు సమగ్రమైన అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ యజ్ఞం విజయవంతం కావటంరాష్ట్ర ప్రజల విజయంగా భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో మూడు రాజధానులతో పాటు.. రెండు రాజధానుల నడుమ ఉన్న గోదావరి జిల్లాలు, వెనుకబడిన 3 ఉత్తరాంధ్ర జిల్లాలు,  4 రాయలసీమ జిల్లాలు కూడా అభివృద్ధి చేయడానికి వీలు కలుగుతుంది. 

సాక్షి ప్రతినిధి కడప : అందరూ ఎదురు చూస్తున్న పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఎట్టకేలకు ఆమోదం లభించింది.గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ శుక్రవారం ఈ బిల్లుతోపాటు సీఆర్‌డీఏ రద్దు బిల్లుకు ఆమోదముద్ర వేశారు. దీంతో ప్రభుత్వ ఆలోచన మేరకు ఆంధ్రప్రదేశ్‌ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్టణం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు మారనున్నాయి.గతంలో చెప్పినట్లుగానే కర్నూలుకు న్యాయ రాజధాని రానుంది. వైఎస్సార్‌ కడప జిల్లాతోపాటు రాయలసీమ ప్రాంతానికి ఇది మరింత అనుకూలంగా మారనుంది.వెనుకబడిన ప్రాంతాలు త్వరితగతిన అభివృద్ధి చెందనున్నాయి.నిధుల కేటాయింపులు ఒకే ప్రాంతానికి కాకుండా అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత క్రమంలో కేటాయించనున్నారు. దీంతో వెనుకబడిన కడపతోపాటు రాయలసీమ జిల్లాల అభివృద్ధి వేగవంతం కానుంది. ముఖ్యంగా వైఎస్సార్‌ కడపజిల్లా అభివృద్ధికి మార్గం సుగమం కానుంది.  

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా అభివృద్ధికి కంకణబద్దులై పనిచేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగవంతం చేశారు. రాయలసీమ కరువు నివారణ పథకంలో భాగంగా జిల్లాలోని గండికోట, తెలుగుగంగ, కేసీ కెనాల్‌ల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టారు. గండికోటలో పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 26.85 టీఎంసీలు పెట్టేందుకు చర్యలు వేగవంతం చేశారు. దాని పరిధిలో వేల కోట్లతో ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. తద్వారా పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, రాయచోటి ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించనున్నారు. గండికోట పరిధిలో ప్రస్తుతం ఉన్న సాగునీటి వనరులను మరింతగా విస్తరిస్తున్నారు. కొండాపురం సమీపంలో 20 టీఎంసీలతో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి పూనుకున్నారు. వీటి పరిధిలో పలు ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు.

మరోవైపు తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలో పెద్ద ఎత్తున పనులు చేపట్టారు. తెలుగుగంగ ప్రధాన కాలువ విస్తరణతోపాటు లైనింగ్‌ పనులను మొదలు పెడుతున్నారు. బ్రహ్మంసాగర్‌ కట్ట లీకేజీ అరికట్టే పనులను చేపట్టారు. ఈ ప్రాజెక్టు పరిధిలో పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరిచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. కేసీ కెనాల్‌ అభివృద్ధి పనులను చేపడుతున్నారు.ఇవి కాకుండా ఆయకట్టు స్థిరీకరణ కోసం జొలదరాశి, రాజోలి జలాశయాలతోపాటు కుందూ, తెలుగుగంగ ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరోవైపు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో జమ్మలమడుగు వద్ద రూ. 15 వేల కోట్లతో స్టీల్‌ ప్లాంటు నిర్మించనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. కడప శివారులోని కొప్పర్తితోపాటు జిల్లా వ్యాప్తంగా కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు.పరిపాలన వికేంద్రీకరణతో జిల్లాకు పెద్ద ఎత్తున ని«ధులు రానున్నాయి.  

అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం 
అధికారం చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకోసం మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణతోనే ప్రాంతీయ అసమానతలకు చెక్‌ పెట్టవచ్చని భావించారు. పాలనా వ్యవహారాల వికేంద్రీకరణ వల్ల అన్ని జిల్లాలు అభివృద్ధితోపాటు తక్కువ ఖర్చుతో ప్రజలందరికీ కనీస సౌకర్యాలు అందించవచ్చని భావించారు. దీనికోసం జీఎన్‌ రావు, బోస్టన్‌ కమిటీలు వేశారు. కమిటీ నివేదికలపై అందరితో చర్చించారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లును శాసనసభలో ఆమోదించారు. అనంతరం బిల్లులను గవర్నర్‌కు పంపారు. ఎట్టకేలకు గవర్నర్‌ శుక్రవారం సీఆర్‌డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులకు ఆమోదం తెలిపారు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టగానే పరిపాలన కేంద్రీకరణ ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. 

అంతిమ విజయం సత్యం, ధర్మానిదే 
 కడప కార్పొరేషన్‌: మొదట ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదురైనా సత్యం, ధర్మమే  అంతిమంగా  విజయం సాధిస్తాయని వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు అన్నారు. వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలపడంపై  శుక్రవారం  కడపలో బాణా సంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు.అనంతరం సురేష్‌బాబు మాట్లాడుతూ తన  40 ఏళ్ల అనుభవంతో అద్భుత రాజధాని నిర్మిస్తానని ప్రజలను నమ్మించి 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలను నట్టేట ముంచారన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచి మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారన్నారు. బిల్లు ఆమోదం పొందడంతో ప్రజలు హర్షిస్తున్నారున్నారు. నాయకులు జి. గరుడాద్రి, సీహెచ్‌ వినోద్‌కుమార్, మల్లికార్జున,  కొండయ్య,  ఖాజా, పి. సంపత్‌ కుమార్,  మునిశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు