‘మీ వల్లే నాన్న బతికారు.. మిమ్మల్ని చూడాలని వచ్చారు’

17 Oct, 2022 16:44 IST|Sakshi

ఆళ్లగడ్డ ‘రైతు భరోసా’ కార్యక్రమంలో లబ్ధిదారుల భావోద్వేగం

సాక్షి, నంద్యాల జిల్లా: రైతు భరోసా సాయాన్ని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, వైఎస్సార్‌ రైతు భరోసాతో ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఆర్బీకే కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఎరువులు కోసం గతంలో రోజుల తరబడి క్యూ ఉండేది. ఇప్పుడు విత్తనం నుంచి విక్రయం దాకా ఆర్బీకేలు అండగా ఉన్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌ రైతులకు పెద్దదిక్కుగా ఉన్నారన్నారు. ఇంకా లబ్ధిదారులు ఏమన్నారంటే వారి మాటల్లోనే..
చదవండి: గజ దొంగల ముఠా మంచి చెప్పదు.. ఎల్లో మీడియాకు సీఎం జగన్‌ కౌంటర్‌

మీ వల్లే ఆయన బతికారు​‍: భూక్యే క్రిష్ణానాయక్, గిరిజన రైతు
జగనన్నా నేను నిరుపేద గిరిజన రైతును, నాలుగేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. మా నాన్న పొలం ఇచ్చాడు కానీ పంట పెట్టుబడికి డబ్బు ఇవ్వలేదు. జగనన్న వచ్చిన తర్వాత పంట పెట్టుబడి సాయం ఇవ్వడంతో నేను వ్యవసాయం మొదలుపెట్టాను. సాగు చేస్తున్నాను. నాకు ఆర్బీకేల ద్వారా పొలంబడిలో అవగాహన కల్పించారు. నేను వరి వేస్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయాను. కానీ జగనన్న ప్రవేశపెట్టిన పంటల బీమా, ఈ కేవైసీ ద్వారా సీజన్‌ ముగిసేలోగా నాకు రూ. 40 వేలు వచ్చాయి.

బ్యాంకు నుంచి లోన్‌ తీసుకుని సకాలంలో కట్టడం వలన దానికి సున్నావడ్డీ కింద రూ.3 వేలు వచ్చాయి. గతంలో ఎన్నడూ పంట నష్టం, ఇన్‌పుట్‌ సబ్సిడీ రాలేదు. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి. మా నాన్నకు పింఛన్‌ వస్తుంది, మా అమ్మ, నాన్నకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సలు జరిగాయి. మీ వల్లే ఆయన బతికారు. ఈ రోజు ఈ సభకు కూడా మిమ్మల్ని చూడాలని వచ్చారు. తెలుగుగంగ ప్రాజెక్ట్‌ కెనాల్‌కు పిల్ల కాలువలు డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ తవ్వించి ఈ నియోజకవర్గానికి సాగు, తాగు నీరు ఇచ్చారు.  వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు పథకాన్ని ప్రారంభించినందుకు మా గిరిజనుల తరపున మీకు ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు.

అమ్మ సంతోషపడింది: దూదేకుల గుర్రప్ప, రైతు
జగనన్నా నమస్కారం, అన్నా నేను ఏడు ఎకరాల సాగు చేస్తున్నాను, గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా సాయం అందింది. మూడేళ్ళ పాటు ఏటా రూ. 13,500 చొప్పున తీసుకున్నాను. మీరు వేశారు నా అకౌంట్‌లో వచ్చాయి. నాకు పంట నష్టం సాయం కూడా అందింది, దానికింద అక్షరాలా రూ. 30 వేలు సాయం అందింది, పంటల బీమా కూడా అందుతుంది. ప్రతి రైతు ఈ కేవైసీ చేయించుకోవాలి. పంటల బీమా చేయించుకోవాలి. నేను 20 ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నాం.

గతంలో ఎరువుల కోసం క్యూలైన్లో నిలబడి ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం కానీ ఈరోజు మన గ్రామంలో ఆర్బీకేలో మనకు అందుతున్నాయి. అన్నీ ఇక్కడే అందుతున్నాయి, జగనన్నా మేం గ్రూప్‌గా ఏర్పడి ట్రాక్టర్, కంకుల కటింగ్‌ మిషన్, ఇతర సామాగ్రి తీసుకున్నాం, మాకు సబ్సిడీ అందింది, మేం రైతులకు తక్కువ రేట్‌లకే వ్యవసాయ పనులకు పనిముట్లను ఇస్తున్నాం. మా అమ్మకు క్యాన్సర్‌ ఆపరేషన్‌ జరిగితే సీఎంఆర్‌ఎఫ్‌ కింద రూ. 60 వేలు వచ్చాయి. కొడుకుగా నా బాధ్యత జగన్‌ తీసుకున్నారని అమ్మ సంతోషపడింది. మా కుటుంబ సభ్యుడివి అన్నా, ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా అందింది. మన జగనన్నను మనం 175 కి 175 సీట్లతో గెలిపించాలి. మన రైతులు, మన అక్కచెల్లెల్లు మనం గెలిపించుకోవాలి, ధన్యవాదాలు. 

మరిన్ని వార్తలు