ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు పెద్దపీట
జగనన్న పాలనతో అందరి మోముల్లో సంతోషం
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని
వైఎస్సార్ సీపీ బస్సు యాత్ర పోస్టర్ల ఆవిష్కరణ
చిలకలూరిపేట: రాష్ట్రంలో సామాజిక న్యాయం వర్ధిల్లుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. సామాజిక న్యాయభేరి పేరుతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 29 వరకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మంత్రులతో నిర్వహిస్తున్న బస్సు యాత్ర పోస్టర్లను పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో ఆదివారం పార్టీ నాయకులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీలను అందలమెక్కించారని కొనియాడారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో దాదాపు 75 శాతం బలహీనవర్గాలకే అందుతున్నాయంటే సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం ఎంతగా పరితపిస్తోందో అర్థమవుతోందన్నారు. 25 మంది సభ్యులున్న రాష్ట్ర కేబినెట్లో ఏకంగా 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలే ఉన్నారంటే జగనన్న ఎంత చిత్తశుద్ధితో సామాజిక న్యాయం అమలు చేస్తున్నారో తెలుస్తోందన్నారు. బీసీల ఉనికి చాటేలా 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతోందన్నారు. ఈ అంశాలను వివరించేందుకే బస్సు యాత్ర చేపట్టినట్లు మంత్రి చెప్పారు.
ఇదిలా ఉంటే గుంటూరు బృందావన్ గార్డెన్స్లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, బాపట్లలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బీసీ నేతలతో కలిసి శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి బస్సు యాత్ర పోస్టర్లు ఆవిష్కరించారు.