ఊరూరా సందడే సందడి 

13 Mar, 2023 05:38 IST|Sakshi
గుంటూరులో 500 మీటర్ల వైఎస్సార్‌సీపీ జెండాతో ర్యాలీ చేస్తున్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు

ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం 

రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున వేడుకలు  

దివంగత సీఎం వైఎస్సార్‌కు ఘనంగా నివాళి 

ర్యాలీలు.. కేక్‌ కటింగ్‌లు.. దుస్తుల పంపిణీ 

గుంటూరులో 500 మీటర్ల పార్టీ జెండాతో ర్యాలీ 

మిన్నంటిన జై జగన్‌ నినాదాలు 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినో­త్సవాన్ని ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణు­లు, నేతలు పండగలా నిర్వహించారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించి.. వైఎస్సార్‌సీపీ జెండా­లనూ ఊరూరా ఆవిష్కరించారు. భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించి.. పార్టీ కార్యాలయాల్లో భారీ కేక్‌లు కట్‌ చేశారు. నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేసి.. అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, వైఎస్సార్‌సీపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దివంగత వైఎస్సార్‌ ఆశయ సాధనే లక్ష్యంగా.. ప్రజాభ్యుదయమే ధ్యేయంగా 2011 మార్చి 12న వైఎస్సార్‌సీపీని సీఎం వైఎస్‌ జగన్‌ స్థాపించిన విషయం తెలిసిందే.

ఈ ప్రస్థానంలో 12 ఏళ్లు పూర్తి చేసుకుని ఆదివారం 13వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తు­న సేవాకార్యక్రమాలు నిర్వహించారు. తాడేపల్లి­లోని కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవా­న్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు జోగి రమేష్, మేరుగు నాగార్జున, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి, మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. అన్ని నియోజకవ­ర్గాల్లో ఎమ్మెల్యేలు, నేతలు పార్టీ ఆవిర్భావ దినోత్స­వాన్ని ఘనంగా నిర్వహించారు. మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌ సాగిస్తున్న సంక్షేమాభివృద్ధి పాలనను గుర్తుచేస్తూ యువకులు జై జగన్‌ నినాదాలు చేశారు. 

► విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెం కార్యాలయంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మహానేత వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  

► అనంతపురం జిల్లా కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. తిరుపతిలోని తన నివాసంలో మంత్రి పెద్దిరెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. నగరి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంత్రి ఆర్కే రోజా కేక్‌ కట్‌ చేశారు. తిరుపతిలో ఎంపీ గురుమూర్తి జెండా ఎగురవేశారు. ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ కేక్‌ కట్‌ చేశారు.  

► గుంటూరులో పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించి, కేక్‌ను కట్‌చేశారు. 500 మీటర్ల వైఎస్సార్‌సీపీ జెండాతో ర్యాలీ నిర్వహించారు. విజయవాడ­లోని పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని నేతలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్, కృష్ణాజిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ పతాకం రెపరెపలాడింది.  

► ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మంత్రి కారుమూరి, ఏలూరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని వేడుకల్లో పాల్గొన్నారు.   

► ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన వేడుకల్లో మంత్రి వేణు, హోంమంత్రి తానేటి వనిత, ఎంపీ భరత్‌రామ్‌ పాల్గొన్నారు.

► విజయనగరంలో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరులో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర పార్టీ జెండాను ఎగురవేశారు. 

వైఎస్సార్‌సీపీ రోల్‌ మోడల్‌ 
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు వైఎస్సార్‌సీపీ ఓ రోల్‌ మోడల్‌ అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా, పార్టీని ఏమీ చేయలేరని, ఓటమి అనేదే ఉండదన్నారు. వైఎస్సార్‌సీపీని దేశంలోనే ఆదర్శవంతమైన పార్టీగా తీర్చిదిద్దిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌దేనని తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల.. వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కేక్‌ కట్‌ చేసి, పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. పార్టీ పతాకంలోని రంగుల బెలూన్లను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ 12 ఏళ్ల ప్రస్థానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా సాగిందన్నారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసి ప్రజలతో మమేకమైన నాయకుడు వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు. పరిపాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు మెచ్చేలా పాలన సాగిస్తున్నారని చెప్పారు.

అధికారం అంటే బాధ్యత, సేవ అని చాటి చెప్పిన నేత వైఎస్‌ జగన్‌ అని తెలిపారు.  వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ విప్లవాత్మకం అని, ప్రజల ఇంటి గడప వద్దకే పరిపాలన అందుతోందన్నారు. ఏ సమస్య అయినా సచివాలయం ద్వారా పరిష్కరించే పరిస్థితి తీసుకువచ్చారని చెప్పారు. మరో అడుగు ముందుకేస్తూ.. త్వరలో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం మొదలు పెడుతున్నామని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు