ఇంకేం చర్యలు తీసుకుంటాం.. కోటంరెడ్డి వ్యవహారంపై స్పందించిన సజ్జల

1 Feb, 2023 15:54 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వ్యవహారంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. బుధవారం  వైసీపి కేంద్ర కార్యాలయంలో రాష్ట్రస్థాయి సర్పంచ్‌ల సమావేశంలో పాల్గొన్న ఆయన..  మీడియాతో మాట్లాడారు. కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. 

‘‘కోటంరెడ్డి పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది?. ఆయనే తన ఉద్దేశాలు చెప్పిన తర్వాత చర్యలు ఏం తీసుకుంటాం?. అయినా.. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌లను కాదు’’ అని సజ్జల స్పందించారు. ఎవరైనా ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని.. పదవి రాలేదని అసంతృప్తి ఉండటం వేరు, బహిరంగంగా ఇటువంటి ఆరోపణలు చేయటం వేరని సజ్జల వ్యాఖ్యానించారు. 

అలాగే.. అక్కడి నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఇంకా ఎవరినీ నియమించ లేదన్న సజ్జల.. కొంతమందిని ఎలా లాక్కోవాలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తెలుసని సజ్జల వ్యాఖ్యానించారు.

ప్రకాశం:  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి టీడీపీ డైరెక్షన్ లో మాట్లాడుతున్నాడని మాజీమంత్రి, వైఎస్సార్‌పీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని వ్యాఖ్యానించారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ లేదు.. పాడు లేదు.. మంత్రి పదవి ఇవ్వలేదనే అక్కసుతోనే శ్రీధర్ రెడ్డి, ఆనం డ్రామాలు ఆడుతున్నారు. దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ అయినట్టు నిరూపించాలని సవాల్‌ విసిరారు బాలినేని. ఫోన్ ట్యాప్ అయితే ఎమ్మెల్యే ఆనం ఇన్ని రోజులు ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు. రేపో ఎల్లుండో నెల్లూరు రూరల్ కి కొత్త ఇంచార్జి నియామకం ఉంటుందని, వాళ్లిద్దరూ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని బాలినేని మండిపడ్డారు. వైస్సార్సీపీ లో నాయకులకు కొదవలేదు.. ఒకరు పోతే పది మంది తయారవుతారని బాలినేని కామెంట్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు