విజయం మనదే.. భారీ మెజార్టీకి కృషి

20 Feb, 2023 04:40 IST|Sakshi
మాట్లాడుతున్న వై.వి.సుబ్బారెడ్డి

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు 

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఉత్తరాంద్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే గెలుపని ఆ పార్టీ నాయకులు చెప్పారు. భారీ మెజార్టీ కోసం కలిసి కృషిచేద్దామని పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఆదివారం ఈ ఎన్నికల సన్నాహక సమావేశం జరి­గింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్, టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్టీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌ భారీ విజయం సాధించేందుకు అందరూ కలిసి పనిచేద్దామని చెప్పారు.

20 రోజుల పాటు ఆయా నియోజకవర్గ నాయకులు ఓటర్లను కలిసి అత్యధిక మెజార్టీ సాధించే దిశగా పనిచేయాలని కోరారు. బూత్‌స్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఇంకా ఓటు నమోదుకు అవకాశం ఉన్నందున అర్హులంతా ఓటర్లుగా చేరేలా దృష్టి సారించాలని కోరారు. రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ పట్టభద్రులు టీడీపీ, బీజేపీ నాయకుల మాయమాటలను నమ్మవద్దని కోరారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పరిపాలన వికేంద్రీకరణ చేపట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ అని చెప్పారు. విద్యా­శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తమ పార్టీ ఎక్కడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదని తెలిపారు.

అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాల­నాయుడు, రాజన్నదొర, మాజీ మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాసు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు, సమన్వయకర్తలు, సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు