నడుస్తోంది నవశకం

31 May, 2023 03:45 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలనకు నాలుగు సంవత్సరాల పూర్తితో అంతటా పండుగ శోభ 

తెలుగునాట చరిత్రను తిరగరాసిన వైఎస్సార్‌సీపీ 

గొప్ప పరిపాలనతో జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు 

పేదల పక్షాన నిలబడిన ఆయనకే ప్రజలు మళ్లీ పట్టం కడతారు 

చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు చెత్తకాగితంలా చూస్తున్నారు 

సీఎం జగన్‌ నాలుగేళ్ల పాలనపై వైఎస్సార్‌సీపీ నేతలు  

సాక్షి నెట్‌వర్క్‌: సరిగ్గా నాలుగేళ్ల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారంతో ఏపీలో నూతన శకం ఆరంభమైందని వైఎస్సార్‌సీపీ నేతలు కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ నాలుగు సంవత్సరాల పాలన పూర్తిచేసుకున్న సీఎంకు వారు అభినందనలు తెలిపారు. ఆయన సారథ్యంలో అమలవుతున్న నవరత్నాలతో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ నాలుగేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ ఎంపీలు వి. విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు విడదల రజిని, కారుమూరి నాగేశ్వరరావు, కాకాణి గోవర్థన్‌రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్, సీదిరి అప్పలరాజు వేర్వేరుచోట్ల స్పందించారు. వారేమన్నారంటే.. 

చరిత్ర తిరగరాసిన వైఎస్సార్‌సీపీ 
2019 అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకు 151 సాధించి వైఎస్సార్‌సీపీ తెలుగునాట చరిత్ర తిరగరాసింది. అప్పటికి పదేళ్ల క్రితం 2009 మేలో కడప నుంచి లోక్‌సభకు భారీ మెజారిటీతో ఎన్నికైన వైఎస్‌ జగన్‌ దశాబ్ద కాలంలో ఏ యువ రాజకీయ నా యకుడు ఎదుర్కొనని అడ్డంకులు, ఇబ్బందులను ధైర్యంగా అధిగమించారు.

తన తండ్రి దివంగత సీఎం వైఎస్సార్‌ బాటలో జనం మధ్య దివిటీలా కదులుతూ సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. నవరత్నాలు వంటి హామీలతో వైఎస్సార్‌సీపీ 2019లో చరిత్రాత్మక విజయం సాధించింది.  కోవిడ్‌ వంటి విపత్కర సమయంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి వైఎస్సార్సీపీ సర్కారు ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకాలు ఎంతగానో ఉపకరించాయి.  
    – ఎంపీ వి.విజయసాయిరెడ్డి  

చరిత్రలో నిలిచిపోయే గొప్ప పాలన  
సీఎం వైఎస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోయే గొప్ప పరిపాలన అందిస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో మా ప్రభుత్వం గొప్ప సంస్కరణలు తీసుకొచ్చింది. జగనన్న అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక వంటి పథకాలను తీసుకువచ్చి పేద విద్యార్ధికి విద్యను మరింత చేరువ చేశారు. ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించారు.

ప్రభుత్వాసుప త్రులనూ ఆధునీకరించటంతో పాటు కొత్త ఆసుపత్రులను నిర్మించారు. ఐదు మెడికల్‌ కళాశాలలు ఈ ఏడాది నుంచి ప్రారంభమవుతాయి. ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు.  గతంలో ఎవ్వరూ చేయని విధంగా ఏకంగా 32 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. మహిళలకు ఎన్నో పథకాలు అమలుచేస్తున్నారు.     
– మంత్రి విడదల రజిని

బీసీలపై చంద్రబాబుది కపట ప్రేమ  
అధికారంలో ఉన్నప్పుడు తాటతీస్తా, తోకలు కత్తరిస్తా అంటూ బీసీలను బెదిరించి, భయపెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ కల్పిస్తానంటూ కపట ప్రేమను ఒలకబోస్తున్నారు. 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపారా? నాలుగేళ్లలో వైఎస్సార్‌సీపీకి 8 రాజ్యసభ స్థానాలు దక్కితే.. అందులో 4 స్థానాలను సీఎం జగన్‌ బీసీలకు ఇచ్చారు. సీఎం జగన్‌ తన కేబినెట్‌లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు స్థానం కల్పించారు. జగన్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా పేదలకు రూ.2.11 లక్షల కోట్ల లబ్ధిచేకూరిస్తే.. అందులో బీసీలకే రూ.99,680 కోట్లు ఇచ్చారు. 
    – మంత్రి కారుమూరి నాగేశ్వరరావు 

బాబు.. కపట నాటక సూత్రధారి 
కపట నాటక సూత్రధారి చంద్ర బాబు మరోసారి ప్రజలకు మోసపూరిత వాగ్ధానాలు చేసి అధికారం చేజిక్కించుకునేందుకు ఆరాటపడుతున్నాడు. అన్ని వ ర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ నాలుగేళ్లు పూర్తిచేసుకున్న సీఎం జగన్‌కు అభినందనలు. గతంలో ఎన్నడూ లేనివిధంగా, ఎవరూ ఆలోచన చేయని విధంగా సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకే అందిస్తున్నారు.

కరోనా కాలంలో వైద్యానికి ప్రాధాన్యతనిచ్చి ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు చేపట్టారు. 2014 ఎన్నికల మేనిఫె స్టోలో 650 వాగ్ధానాలను చేసిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తరువాత అందులో కనీసం పదిశాతమైనా అమలుచేశారా? అదే జగన్‌ 98శాతం హామీలను అమలుచేశారు. బాబు రాజధాని పేరిట రైతుల భూములను కాజేశారు. 
    – మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి 

రాష్ట్ర దశ, దిశను మార్చిన ఘనత జగనన్నదే  
రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పాటుపడుతూ రాష్ట్ర దశ, దిశను మార్చివేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదే. ఆయన సారథ్యంలో రాష్ట్రంలో అమలవుతున్న నవరత్నాలతో ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. వివిధ రంగాల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. రాష్ట్రంలో వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం బాటలో పయనిస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి జాతీయస్థాయిలో పలువురి నాయకులకు ఆదర్శప్రాయుడిగా నిలిచారు. 
    – ఎంపీ మోపిదేవి 

ప్రగతిపథంలో రాష్ట్రం పరుగులు  
సీఎం వైఎస్‌ జగన్‌  పాలనలో రాష్ట్రం ప్రగతిపథంలో పరుగులు తీస్తోంది. 2018–19నాటికి రాష్ట్ర జీడీపీ వృద్ధి రేటు 22వ ర్యాంకులో ఉంటే ఆర్‌బీఐ తాజా నివేదిక ప్రకారం అది ఒకటో స్ధానంలో నిలవడం ముఖ్యమంత్రి పాలనకు నిదర్శనం. ఇదే ప్రజారంజక పాలనకు సూచి. ఈ విషయంలో ప్రతిపక్షాలు తమ మీడియా సపోర్టుతో బురదజల్లే కార్యక్రమం చేస్తున్నాయి.

2019కి తలసరి ఆదాయంలో ఏపీ 17వ స్థానంలో ఉండగా సీఎం జగన్‌ 9వ స్థానంలో నిలబెట్టారు. ఇటీవల నిర్వహించిన గ్లోబల్‌ సమ్మిట్‌లో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ద్వారా అవలంబిస్తున్న నిర్మాణాత్మక కార్యక్రమాలతో రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2018–19లో ఏపీ వ్యవసాయ వృద్ధి –6.5 శాతంతో దేశంలో 27వ స్ధానంలో ఉంటే ప్రస్తుతం 8.5 శాతం వృద్ధిరేటుతో ఆరో స్థ్ధానంలో నిలబడింది. 
    – మంత్రి చెల్లుబోయిన వేణు

ఏపీ వైపు.. ఇతర సీఎంల చూపు  
దేశంలోని ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి వైపు చూస్తుంటే చంద్రబాబు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి మహానాడులో ఆయన చిత్రపటానికి చంద్రబాబు దండలు వేయడం సిగ్గుచేటు. మహనీయుడు ఎన్టీఆర్‌ ఆత్మ ఆ సమయంలో క్షోభకు గురై ఉంటుంది.

ఆయన జీవించిన సమయంలో చంద్రబాబు ఎన్టీఆర్‌ను ముప్పుతిప్పలు పెట్టడమే కాకుండా వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని లాక్కున్నాడు. భగవంతుడు ఎన్టీఆర్‌కు ఐదు నిమిషాల ఆయుష్షు ఇస్తే అదే వేదికపై ఓ శూలంతో చంద్రబాబును చంపి.. తర్వాత ఎన్టీఆర్‌ వెళ్లిపోయేవాడు. మహానాడులో చంద్రబాబు చెప్పిన మాటలన్నీ అసత్యాలే.   
 – మంత్రి జోగి రమేష్‌ 

సీఎం పథకాలవల్లే ధైర్యంగా గడపగడపకు 
పేదలకు జగనన్న ప్రభుత్వం ఇంటిపట్టాలు ఇవ్వడమే కాకుండా ఇంటి నిర్మాణాలు చేపడుతుంటే వాటిని చంద్రబాబు శ్మశానంతో పోల్చడం సరికాదు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌కు రాజకీయ భవిష్యత్‌ లేదు. ఆ పార్టీకి ప్రజలు సమాధులు కట్టడం ఖాయం. దేశంలో ఏ రాష్ట్రం కానీ, ఏ పార్టీ నేతలు కానీ గడప గడపకు వెళ్లిన దాఖలాల్లేవు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలుచేస్తున్న పథకాలు ప్రజలకు నేరుగా అందుతున్నందునే ప్రజాప్రతినిధులు గడప గడపకు ధైర్యంగా వెళ్లగలుగుతున్నారు. 
    – డిప్యూటీ సీఎం నారాయణస్వామి 

టీడీపీ మేనిఫెస్టో విడ్డూరంగా ఉంది 
చంద్రబాబుకు నీతి, నిజాయితీలు ఏమిలేవు. ప్రజలను తప్పుదారి పట్టించడానికి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన పథకాలను కాపీకొట్టి టీడీపీ మేనిఫెస్టో అని చెబుతున్నారు. ప్రభుత్వ పథకాలపై ఒకప్పుడు విమర్శలు చేసి ఏపీ శ్రీలంకలా మారిపోతుందని, జనం సోమరులవుతారని అన్న చంద్రబాబు ఇప్పుడు ఆ పథకాలకే పేర్లు మార్చి మేనిఫెస్టో విడుదల చేయడం విడ్డూరంగా ఉంది.

మా పథకాలపై లోకేశ్, చంద్రబాబు మాట్లాడిన మాటలు ఎవరూ మర్చిపోరు. జగనన్న ఇళ్లపై విమర్శలు చేసిన చంద్రబాబు ఒక్కరికైనా ఇల్లు కట్టి ఇచ్చారా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావులు ఎన్ని రాతలు రాసినా రాష్ట్ర ప్రజలు నమ్మరు. తను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 2024లో కూడా వైఎస్‌ జగన్‌ అత్యధిక మెజార్టీతో గెలుస్తారు.  
    – మంత్రి సీదిరి అప్పలరాజు   

మరిన్ని వార్తలు