స్వామి భక్తి చాటుకున్న వీఆర్వో 

19 Apr, 2021 13:02 IST|Sakshi
లోకేష్‌తో వీఆర్వో ముని (ఫైల్‌)

ఉప ఎన్నికల సమయంలో బూత్‌ల వద్ద హల్‌చల్‌ 

చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ నాయకుల డిమాండ్‌

సైదాపురం: మండలంలోని మర్లపూడి వీఆర్వో ముని శనివారం జరిగిన తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల పోలింగ్‌ సమయంలో టీడీపీకి ఓట్లేయంటూ ఓ పోలింగ్‌ బూత్‌ వద్ద ఓటర్లను ప్రభావితం చేయడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల వేళ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఉద్యోగి ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంపై స్థానికులు మండిపడ్డారు. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామ వీఆర్వోగా పనిచేస్తున్న ముని టీడీపీ నేత లోకేష్‌తో దిగి ఉన్న ఫొటో ఆదివారం వాట్సాప్‌ గ్రూపుల్లో హల్‌చల్‌ చేసింది.

శనివారం జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో  ఓటింగ్‌ వేసేందుకు వస్తున్న ఓ వృద్ధ దంపతులను టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేయాలంటూ వీఆర్వో ప్రలోభాలకు గురిస్తున్నారనే అనుమానంతో స్థానికులు నిలదీశారు. దీంతో కొంత సేపు పోలింగ్‌ కేంద్రం వద్దనే వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు రంగప్రవేశం చేసి వివాదాన్ని సర్దుబాటు చేసి వీఆర్వోను పోలింగ్‌ కేంద్రం వద్ద నుంచి తీసుకెళ్లారు. వీఆర్వో పనితీరు మొదటి నుంచి సక్రమంగా లేదంటూ ఆ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారి ఓ పార్టీకి తొత్తుగా వ్యవహరించడం ఏమిటని మర్లపూడి వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వీఆర్వోను వెంటనే సస్పెండ్‌ చేయాలంటూ స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు వరదబండి ప్రభాకర్‌రెడ్డి, చీర్ల వెంకురెడ్డి, భాస్కర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.
చదవండి:
టీడీపీలో సస్పెన్షన్ల కలకలం..
వీర్రాజు, అచ్చెన్నలకు పదవీ గండం?

మరిన్ని వార్తలు