'మాజీ ఎమ్మెల్యేకు కబ్జాలు వెన్నతో పెట్టిన విద్య'

30 Nov, 2020 08:34 IST|Sakshi
మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు షామీర్, మాజీ మంత్రి షాకీర్‌

‘క్రిస్టియన్‌’ ఆస్తులు కబ్జా చేసింది ఆయనే 

డబ్బు ఆశ పెట్టి యువతను పెడద్రోవ పట్టిస్తున్నాడు 

మాజీ మంత్రి మహమ్మద్‌ షాకీర్‌

సాక్షి, అనంతపురం (కదిరి): ఇతరుల ఆస్తిని కబ్జా చేయడం టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌కు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి మహమ్మద్‌ షాకీర్‌ విమర్శించారు. ఆదివారం ఆయన తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కదిరిలో కబ్జా పేరు వింటే అందరికీ కందికుంట పేరు గుర్తుకు వస్తుందన్నారు. పట్టణంలో ఎంతో మంది క్రిíస్టియన్‌ అనాథ పిల్లలు చదువుకునే స్కూల్‌ను కందికుంట కబ్జా చేసి కూల్చేసిన విషయం కదిరి ప్రాంత ప్రజలందరికీ తెలుసన్నారు. గతంలో తాను హిందూపురంలో 8 ఎకరాల ఆస్తిని నిబంధనల ప్రకారమే  క్రిస్టియన్‌  పెద్దల నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తు చేశారు. అందులో 6 ఎకరాలను అప్పట్లోనే తాను సూచించిన వారి పేర్ల మీద రిజిష్టర్‌ కూడా చేయించారని వివరించారు. మిగిలిన రెండెకరాలు రిజిష్ట్రేషన్‌ చేయించడం ఆలస్యమైందని, ఆ భూమి విలువ పెరగడంతో రిజిష్ట్రేషన్‌ విలువ కూడా పెరిగిందన్నారు. అయితే ఆ భూమిని తాను కబ్జా చేసినట్లు ఇటీవల ఓ టీవీ చానల్‌లో ప్రసారం చేశారని, ఆ చానల్‌ యాజమాన్యంపై కోర్టులో పరువు నష్టం దావా వేయబోతున్నట్లు వివరించారు.   చదవండి: (మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం)

చంపుతామంటే బెదిరేవాన్ని కాదు.. 
తనను చంపుతానంటే భయపడే వ్యక్తిని కాదని కందికుంటకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్‌ పరికి షామీర్‌ హెచ్చరించారు. బెదిరింపులతో కదిరి ప్రజలను భయపెట్టి రాజకీయం చేయాలని కందికుంట చూస్తున్నారని, ఈ సంస్కృతిని కదిరి ప్రజలు అంగీకరించరన్నారు. డబ్బు ఆశ చూపి కొందరు యువకులను కందికుంట తన వెంట తిప్పుకుంటూ పెడదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.  

త్యాగరాజుపై పలు కేసులున్నాయి 
తమపై తప్పుడు కేసు పెట్టిన త్యాగరాజుపై పలు ప్రాంతాల్లో కేసులు ఉన్నాయని షాకీర్, షామీర్‌ ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలను వారు మీడియాముందుంచారు. సీఅండ్‌ఐజీ మిషన్‌ చర్చి చైర్మన్‌గా చెప్పుకుంటూ కందికుంటతో చేతులు కలిపిన త్యాగరాజు తప్పుడు పనులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.    

మరిన్ని వార్తలు