లోకేశ్‌ ఐరన్‌ లెగ్‌.. ఎక్కడికెళ్తే అక్కడ మటాశ్‌

9 Apr, 2021 18:19 IST|Sakshi

తాడేపల్లి: ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనే ఉత్కంఠ ఎవరికీ లేదు.. ఎవరు రెండో స్థానాన్ని అక్రమిస్తారు.? వైఎస్సార్‌సీపీకి ఎంత మెజారిటీ వస్తుంది అనే ఉత్కంఠ ఉంది అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. తన ఉనికికే ప్రమాదం వచ్చిన సందర్భంలో బాబు, ఆయన కుమారుడు వీధి వీధి తిరుగుతున్నారని, అయినా కూడా జనం రావడం లేదు అని తెలిపారు. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలను తరిమికొడతారట... నిన్నే తరిమికొట్టారు నువ్వు ఎంత చెప్పినా నీ కంఠ శోషే అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. నీకు మిగిలేది ఏమీ లేదు.. చిత్తూరు జిల్లాలోనే నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తున్నారు అని జోస్యం చెప్పారు.

వివేకా హత్యపై టీడీపీ, పవన్, బీజేపీ మాట్లాడుతున్నారు ఎవరైనా అడగదలుచుకుంటే బీజేపీని అడగాలి అని తెలిపారు. కేసు సీబీఐ విచారణ చేస్తోందని గుర్తుచేశారు. లోకేశ్‌ ఏదేదో సవాల్ చేస్తున్నాడు.. ముందు ఎక్కడైనా గెలిచి అగోరించవయ్యా అని సలహా ఇచ్చారు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతా ఉంటాయి..నీలాంటి కుక్కలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని కొట్టిపారేశారు. ఎవరి సాయంతోనో స్టాంఫోర్డ్‌లో చదువుకున్న నీకు మాట్లాడే అర్హత లేదు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నైతిక అర్హత మీకు లేదు అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. 

లోకేశ్‌ ఐరెన్ లెగ్... ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ మటాశ్‌ అని చెప్పారు. పచ్చజెండా పుచ్చిపోయింది... అందుకేగా మండల ఎన్నికల్లో వెనక్కిపోయారు అని తెలిపారు. జగన్ ఎడమ కాలి చిటికెన వేలి గోరుతో లోకేశ్‌ సమానం అని చెప్పారు. స్వరూపానందను కలిసినా, రమణ దీక్షితులు మాట్లాడినా ఉలిక్కి పడుతున్నారని, భగవంతుడి స్వరూపంలో జగన్ మేలు చేశారని ఆయన అంటే ఎందుకు నీకు ఉలుకు అని ప్రశ్నించారు. ఎందుకు పొగుడుతున్నారో తెలుసు...సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారని మెచ్చుకుంటున్నారు అని చెప్పారు. దానికే చంద్రబాబు ఎగిరెగిరి పడుతున్నాడు అని ఎద్దేవా చేశారు. సునీల్ డియోదర్ వాళ్ళ పార్టీని నిలబెట్టడానికి పనిచేయాలని హితవు పలికారు. తిరుపతి వేంకటేశ్వర స్వామి పాదాల వద్ద మీరు, పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైంది అని ప్రశ్నించారు.

సునీల్ డియోదర్ సినిమా ప్రచారానికి వచ్చినట్లుంది... పవన్ కల్యాణ్ సినిమా చూడండి అంటూ ప్రమోట్ చేసుకుంటున్నారు అని వ్యంగ్యంగా చెప్పారు. తిరుపతిలో మీరిచ్చిన హామీ నెరవేర్చనందుకు ఓటు అడిగే హక్కు లేదు అని స్పష్టం చేశారు. సినిమా టిక్కెట్లు కొనండి అనే స్థాయికి బీజేపీ ఎందుకు దిగజారింది..? అని సందేహం వ్యక్తం చేశారు. కోటు వేసుకున్న ప్రతి వారు వకీలు కాలేరు అని గుర్తుచేశారు. తిరుపతి ప్రజలు అద్బుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నారు.. జగన్‌ని మరోమారు ఆశీర్వదించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ ఉండదు అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు