ఉచిత విద్యుత్‌పై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు

5 Sep, 2020 15:36 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ

సాక్షి, తాడేపల్లిగూడెం: హైదరాబాద్‌లో దాక్కొని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ ప్రతిపక్షం పాత్రను సైతం విస్మరించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిగూడెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో జరిగిన అనేక విపత్తుల్లో బాధితులను పరామర్శించడానికి కూడా చంద్రబాబుకు సమయం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు తన సామాజిక వర్గం ఉన్నతి కోసం పాటుపడుతున్నారు తప్ప.. రాష్ట్రం కోసం పాటు పడిన దాఖలాలు ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. (చదవండి: ‘చంద్రబాబువి పగటి కలలు’)

ఉచిత విద్యుత్ పథకం ప్రవేశపెట్టిన మహనీయుడు దివంగత మహానేత వైఎస్సార్‌. ఉచిత విద్యుత్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఒకే ఒక్క పథకం బెల్టుషాపు పథకమని ఆయన ఎద్దేవా చేశారు. నారా లోకేష్ ట్విటర్ వీర ఉత్తర కుమారుడు. ప్రతి పేదవాడికి ఇంటిపట్టాలను ఇచ్చే మంచి కార్యక్రమానికి మోకాళ్ళడ్డిన దుర్మార్గుడు చంద్రబాబు. ఆయనను ప్రజలు ఛీ కొడుతున్నారని విమర్శించారు. తాడేపల్లిగూడెంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, కళాశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.(చదవండి: ‘విద్యుత్‌’పై పేటెంట్‌ వైఎస్సార్‌దే)

మరిన్ని వార్తలు