న్యాయ విచారణలో రాజకీయ వ్యాఖ్యలు అవాంఛనీయం

9 Jan, 2023 08:46 IST|Sakshi

ముందస్తుగా ఎన్నికలు వస్తాయని ఒక జడ్జి ఎలా వ్యాఖ్యానిస్తారు? 

ఏవైనా వ్యాఖ్యలు చేస్తే వాటిని తీర్పులో ఇవ్వండి 

మీ ఆదేశాలను పాటిస్తాం.. తీర్పును విభేదిస్తే అప్పీల్‌ చేస్తాం 

మాకు కోర్టులు, జడ్జిలు, న్యాయ వ్యవస్థపై చాలా గౌరవం  

కోర్టులో లేని అంశాలపై జడ్జి వ్యాఖ్యలు చాలా బాధాకరం  

వాటిని తమ స్వప్రయోజనాలకు పార్టీలు, ఎల్లో మీడియా వాడుకుంటున్నాయి..

ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూడాలి 

హైకోర్టుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ విజ్ఞప్తి

సాక్షి, అమరావతి: న్యాయస్థానాలు, న్యాయమూర్తు­లు, న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిపై ప్రభు­త్వానికి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు, తమకు అపార గౌరవం ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ నొక్కి వక్కాణించారు. ఏదైనా ఉంటే తీర్పులో రాస్తే దాన్ని గౌర­వంగా అమలు చేస్తా­మని తెలిపారు. తీర్పుపై విభేదిస్తే అప్పీల్‌ చేస్తామన్నారు. కానీ, ఇలా చేయకుండా జడ్జి రాజకీయ పార్టీల మాదిరిగా మాట్లా­డుతూ.. ఎల్లో మీడియా, దుష్ట చతుష్ట­యా­నికి ఉపయోగపడేలా వ్యా­ఖ్య­లు చే­యడం సరికాదన్నారు. రాజకీయ పార్టీ­ల మాదిరిగా న్యాయమూర్తి వ్యా­ఖ్యలు చేస్తే ప్రజా­­స్వామ్యంలో రాజ్యాంగ స్ఫూర్తిని, న్యాయవ్యవస్థ గౌరవాన్ని ఏ విధంగా కాపాడుకున్న వాళ్లమవుతామ­ని అన్నారు.

తాడేపల్లి­లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆది­వారం మాణిక్య వరప్రసాద్‌ మీడియాతో మాట్లా­డారు. ఇటీవల హై­కోర్టులో ఒక న్యాయమూర్తి చేస్తున్న వ్యాఖ్యలకు ఎల్లో మీడియా తనదైన వక్రభాష్యం చెబుతూ కథనాలు అచ్చేస్తోందన్నారు. న్యాయ వ్యవస్థను పక్కదారి పట్టి­ం­చి, తమకు కావాల్సిన రాజకీయ ప్రయోజనాల కోసం ఆ వ్యాఖ్యల­ను రాజకీయ పార్టీలు వాడు­కుంటున్నాయన్నారు. ఇటీవల ఒక న్యాయ­మూర్తి కోర్టులో లేని అంశాలను ప్రస్తావిస్తూ ఎన్నిక­లు తొందరగా వస్తాయని వ్యా­ఖ్యా­నించడం బాధాకర­మన్నారు. అందులో ఆయన ఉద్దేశం ఏమిటో త­మ­కు అర్థం కావడం లేదన్నారు.

న్యాయమూర్తి వ్యా­ఖ్యలపై వెంటనే అడ్వొకేట్‌ జనరల్‌ స్పందించి.. ఎన్ని­కలు నిర్దేశిత సమయంలోనే జరుగుతాయని తే­ల్చి­చెప్పారన్నారు. ఆ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల­పై న్యాయ వ్యవస్థలో ఉన్న పెద్దలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని తెలి­పారు. కోర్టులో వాదనలు జరిగేటప్పుడు న్యాయ­మూర్తులు వ్యక్తిగతంగా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని హైకోర్టుకు ఆయన విన్నవించారు. వాదనల సందర్భంగా న్యాయమూర్తులు చేస్తు­­న్న కొన్ని వ్యా­ఖ్యలు రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు, విద్రోహశక్తులకు ఉ­ప­యోగపడుతున్నా­యని ఆందోళన వ్యక్తం చేశారు. 

కోర్టుల్లో ఉన్న రాజధాని అంశంపై వ్యాఖ్యలా? 
రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటించాలని న్యాయమూర్తులకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సూచించారని మాణిక్యవరప్రసాద్‌ గుర్తుచేశారు. ఇటీవల చెన్నై కోర్టు ఒక కేసులో ఎన్నికల సంఘంపై హత్య కేసు నమోదు చేయాలని ఆదేశించడంపై సుప్రీంకోర్టు.. అలా పరిధి దాటి మాట్లాడకూడదని చెన్నై కోర్టుకు దిశానిర్దేశం చేసిందన్నారు. ఏపీకి రాజధాని ఎక్కడో తెలియదని తన కుమార్తె అన్నారని ఇటీవల ఓ న్యాయమూర్తి వ్యా­ఖ్య­లు చేశారని ఆయన గుర్తుచేశారు. రాజధాని అంశంపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణ సాగుతోందని, ఈ సమయంలో దానిపై ­వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు.

ఆ వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలి.. 
గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎస్సీల సంక్షేమం, అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్ర­భు­త్వంపై కొన్ని రాజకీయ పార్టీలు, ఎల్లో మీడియాకు ఉపయోగపడేలా న్యాయమూర్తి వ్యా­ఖ్యలు చేయడం ఎంతవరకు వాంఛనీయం? సబబు? అని మాణిక్య వరప్రసాద్‌ ఆవేదన వ్యక్తంచేశా­రు. రాజకీయ పార్టీలకు ఎన్నో లక్ష్యాలు ఉంటాయని.. వాటి సాధనలో ఆ పార్టీ­లే మార్గాలు చూ­సుకుంటాయని తెలిపారు. వాటి­కి మీ సహకారం అవసరమా... అనేది ఆలోచించుకోవాలన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా రాజ­కీ­య వ్యాఖ్యలు చేయడంపై న్యాయమూర్తి ఒ­క్క­సా­రి ఆత్మపరిశీలన చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: గుంటూరు: డిగ్రీలు లేని పరిశోధకుడు.. 500 అదృశ్య గ్రామాలను గుర్తించి.. 

మరిన్ని వార్తలు