రామోజీ, చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సవాల్‌

11 Oct, 2022 12:25 IST|Sakshi

సాక్షి, విశాఖపట‍్టణం: విశాఖకు పరిపాలన రాజధాని రాకూడదని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యసభ ఎంపీ, వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. ఉత్తరాంధ్రకు ద్రోహం చేసే కుట్రలు సాగుతున్నాయన్నారు. విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు విజయసాయిరెడ్డి. టీడీపీ, ఎల్లోమీడియాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, కొన్ని పత్రికలు కులం అనే ఇంకుతో విషపు రాతలు రాస్తున్నాయని ధ్వజమెత్తారు. 

‘వైఎస్‌ఆర్‌సీపీపై టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఈనాడు దాని అనుబంధ కుల పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. విషపు రాతలతో కొత్తదారులు అన్వేషిస్తున్నారు. ఇంత దిగజారుడుతనాన్ని ప్రదర్శించటం శోచనీయం. వికేంద్రీకరణపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. దసపల్లా భూముల విషయంలో బిల్డర్లు, యజమానులు క్లారిటీ ఇచ్చారు. సుప్రీం తీర్పును అమలు చేసిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుంది. ప్రభుత్వ చర్యలతో 400 కుటుంబాలకు మేలు జరిగింది.

64 ప్లాట్ యజమానుల్లో 55 మంది చంద్రబాబు సామాజిక వర్గం వారే. ఉత్తరాంధ్రలో కాపులు, వెలమలు, యాదవులు, కళింగులు ఎక్కువగా ఉన్నారు. కానీ, భూములు మాత్రం చంద్రబాబు సామాజిక వర్గం చేతిలో ఉన్నాయి. కొన్ని పత్రికలు టీడీపీ కరపత్రం కంటే దిగజారిపోయాయి. కుల పత్రికలపై ఉమ్మి వేసే పరిస్థితి ఏర్పడింది. రామోజీకి నైతిక విలువలు లేవు.. పుట్టుకే అనైతికం.’అని తీవ్రంగా మండిపడ్డారు విజయసాయిరెడ్డి. 

రామోజీ, చంద్రబాబుకు సవాల్‌.. 
ఆస్తులపై సీబీఐ, ఈడీ, ఎఫ్‌బీఐ విచారణకు తాను సిద్ధమని.. రామోజీ, చంద్రబాబు సిద్ధమేనా అంటూ సవాల్‌ చేశారు విజయ సాయి రెడ్డి. విచారణ జరిగితే ఎవరు జైలుకు వెళ్తారో తెలుస్తుందన్నారు. ‘మీడియా రంగంలోకి నేను వస్తున్నా.. రామోజీ చూసుకుందాం. ఒక్క ఫిలింసిటీలోనే 2,500 ఎకరాలు ఆక్రమించుకున్నారు. పచ్చళ్లు అమ్ముకునే వ్యక్తి రూ.లక్షల కోట్లు ఎలా సంపాదించాడు? మార్గదర్శి డిపాజిటర్లను మోసం చేసిన వ్యక్తి రామోజీ.ఆస్తులపై విచారణకు చంద్రబాబు, రామోజీ సిద్ధమా?’ అంటూ సవాల్‌ చేశారు. 

ఇదీ చదవండి: అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ

మరిన్ని వార్తలు