అటు పెగసస్‌.. ఇటు ‘ప్రెసిడెంట్‌ మెడల్‌’

22 Mar, 2022 04:43 IST|Sakshi

చంద్రబాబు చేసింది దేశద్రోహమే 

వైఎస్సార్‌సీపీ ఎంపీలు బోస్, రంగయ్య, రెడ్డెప్ప

సాక్షి, న్యూఢిల్లీ: పెగసస్‌ స్పైవేర్‌ను ఉపయోగించుకున్నందున చంద్రబాబు చేసింది ముమ్మాటికీ దేశద్రోహమేనని వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆరోపించారు. మరోవైపు ప్రెసిడెంట్‌ మెడల్, గవర్నర్స్‌ రిజర్వ్‌ వంటి మద్యం బ్రాండ్లు కూడా చంద్రబాబు హయాంలోనే వచ్చాయని చెప్పారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో సోమవారం వైఎస్సార్‌సీపీ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, తలారి రంగయ్య, ఎన్‌.రెడ్డెప్ప మాట్లాడారు. నాటి ఏపీ సీఎం చంద్రబాబు పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణను తీవ్రంగా పరిగణించాలన్నారు. ‘నాడు ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో కొనుగోలు చేసిన పెగసస్‌పై కేంద్రం చూసీచూడనట్టుగా ఉండడం సరికాదు.  

దేశ అంతర్గత వ్యవహారాలు, భద్రత గురించి ప్రమాదం పొంచి ఉన్న విషయం కేంద్రం దృష్టికి తీసుకొస్తున్నాం. మమత చేసిన వ్యాఖ్యలు సుమోటోగా స్వీకరించి దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కేంద్రాన్ని, రాష్ట్రపతిని కోరుతున్నాం. ఎంపీలందరం ప్రధాని, రాష్ట్రపతిని కలిసి ఈ అంశంపై డిమాండ్‌ చేస్తాం. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. హైఓల్టేజీ బీరు, బ్రిటిష్‌ ఎంపరర్‌ తదితర బ్రాండ్లు కూడా టీడీపీ హయాంలో వచ్చినవే. దేశద్రోహం కింద చంద్రబాబును అరెస్టు చేయాలి. సుమోటోగా తీసుకుని సుప్రీం కోర్టు దర్యాప్తు చేయాలి. పెగసస్‌ స్పైవేర్‌ నాడు కొనుగోలు చేయాలని కోరారంటూ తేలుకుట్టిన దొంగలా లోకేశ్‌ ఇప్పుడు చెబు తున్నారు. ఈ నేపథ్యంలో మరింత లోతుగా విచారణ జరపాలి.  

మరిన్ని వార్తలు