ఘనంగా జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ ప్లీనరీలు

1 Jul, 2022 04:09 IST|Sakshi
నంద్యాల జిల్లా ప్లీనరీలో మాట్లాడుతున్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

నంద్యాల, చిత్తూరు, విశాఖపట్నం, పార్వతీపురం జిల్లాల్లో విజయవంతంగా ప్లీనరీలు 

హాజరైన మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్‌ నేతలు

నంద్యాల/సాక్షి విశాఖపట్నం/సాక్షి చిత్తూరు/పార్వతీపురం టౌన్‌: నంద్యాల, చిత్తూరు జిల్లా పలమనేరు, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో గురువారం వైఎస్సార్‌సీపీ ప్లీనరీలు ఘనంగా జరిగాయి. నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశం నంద్యాలలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, ప్లీనరీ పరిశీలకుడు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ప్రభుత్వ విప్‌ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల బిజేంద్రారెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, తొగూరు ఆర్థర్, శిల్పా చక్రపాణిరెడ్డిలు హాజరయ్యారు.

ముఖ్య అతిథిగా హాజరైన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ 2024  ఎన్నికల్లో కూడా అదే ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నం గురజాడ కళాక్షేత్రంలో జరిగిన జిల్లా ప్లీనరీలో వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి విడదల రజని హాజరయ్యారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని తొలి తీర్మానం ప్రవేశపెట్టారు.  

అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ప్లీనరీ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రానున్న ఎన్నికల్లో కుప్పం నుంచి భరత్‌ పోటీ చేస్తారని, ఆ స్థానాన్ని గెలిచి తీరతామని ఆయన స్పష్టం చేశారు.

కుప్పం అభ్యర్థి విషయంలో తమిళ నటుడితో మంతనాలంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్, పరిశీలకుడు, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు వెంకటే గౌడ, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, ఆరణి శ్రీనివాసులు, ఎంఎస్‌ బాబు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

పార్వతీపురంలో మన్యం జిల్లా పార్టీ అధ్యక్షురాలు పాముల పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో జరిగిన పార్టీ జిల్లాస్థాయి ప్లీనరీలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు డిప్యూటీ సీఎం రాజన్నదొర, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, ఇ.రఘురాజు, ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు