15 వేల మందితో నేడే వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా ప్లీనరీ

28 Jun, 2022 06:03 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా ప్లీనరీ కోసం ఏర్పాటు చేసిన భారీ జర్మన్‌ షెడ్డు

వర్షం పడినా ఇబ్బంది లేకుండా జర్మన్‌ షెడ్లు

ఏర్పాట్లను పూర్తిచేసిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ కమిటీలు

పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ చెవిరెడ్డి వెల్లడి

తిరుపతి తుడా: వైఎస్సార్‌సీపీ తిరుపతి ప్లీనరీ నిర్వహణకు ప్రత్యేక కమిటీలను నియమించామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. ఈ ప్లీనరీకి 15 వేల మంది వస్తున్నట్టు తెలిపారు. వర్షం పడినా ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉండేందుకు జర్మన్‌ షెడ్లను నిర్మించామన్నారు. తిరుపతి నగరం ఎస్వీయూ స్టేడియంలో మంగళవారం జరగనున్న ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లను సోమవారం ఆయన పర్యవేక్షించారు.

అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు జిల్లా ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. 26 జిల్లాల్లో తొలి జిల్లా సమావేశం తిరుపతిలోనే నిర్వహిస్తున్నందున భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్‌లు, చైర్మన్‌లు, పార్టీ నియోజకవర్గ, మండల ఇన్‌చార్జ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొంటున్నట్టు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఘుమఘుమలాడే వంటకాలను సభా వేదిక వద్ద సిద్ధం చేసినట్టు తెలిపారు. ప్లీనరీకి వచ్చే ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలకు స్వాగతం పలికేందుకు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా మామిడి తోరణాలు, అరటి గెలలు, పూల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెవిరెడ్డి వివరించారు. 

మరిన్ని వార్తలు