రెండోసారి బాధ్యతలు: పురుషోత్తముడి సేవకు ‘వైవీ’ పునరంకితం

9 Aug, 2021 08:16 IST|Sakshi

రెండేళ్లలో పరుగులు పెట్టిన టీటీడీ అభివృద్ధి

లోకకల్యాణం కోసం విస్తృతంగా పారాయణాలు

సామాన్య భక్తులకు పెద్దపీట

చైర్మన్‌ హోదాలో సుబ్బారెడ్డి విశేష సేవలు

టీటీడీలో రెండేళ్లుగా ఆధ్యాత్మిక, ధార్మిక ప్రచారం పరవళ్లు తొక్కుతోంది. మరోవైపు ఆలయాల అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాలు పరుగులు తీస్తున్నాయి. చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన అభివృద్ధి హారంలో ‘గుడికో గోమాత’ కలికితురాయిగా నిలిచింది. దేశ నలుమూలలా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తిరుమల స్వామివారి దర్శనంలో భక్తులకు పెద్దపీట వేశారు. కోవిడ్‌ కష్టకాలంలో భక్తుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. లోక కల్యాణం కోసం హోమాలు, శ్లోక పారాయణాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే సుబ్బారెడ్డికి రెండోసారి చైర్మన్‌ పదవి వరించింది.  

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 52వ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డికి మరో అవకాశం కల్పిస్తూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీమోహన్‌ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే పాలకమండలి సభ్యులను నియమించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2019 జూన్‌ 21న టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. అదే ఏడాది సెపె్టంబర్‌లో 37 మంది పాలకమండలి సభ్యులను నియమించారు. అయితే రెండేళ్ల పదవీకాలం ఈ ఏడాది జూన్‌ 21వ తేదీకి ముగిసింది. దీంతో టీటీడీ పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం స్పెసిఫైడ్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డిని రెండోసారి చైర్మన్‌గా నియమించింది. ఈయన శ్రావణమాసం ప్రారంభమైన తర్వాత గురువారం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. (చదవండి: 100 కిలోల స్వర్ణంతో గోవిందుడి గోపురానికి తాపడం)

రెండేళ్లలో టీటీడీ అభివృద్ధి ఇలా.. 

  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో ‘గుడికో గో మాత’ కార్యక్రమం ప్రారంభం.
  • సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడానికి వీలుగా ఎల్‌ 1, ఎల్‌ 2 దర్శనాలు రద్దు 
  • తిరుమలలో ప్లాస్టిక్‌ నిషేధం అమలు 
  • స్వామివారి లడ్డూ ప్రసాదం తీసుకెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు  
  • టీటీడీ రెగ్యులర్‌ ఉద్యోగులకు రూ.14 వేలు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రూ.6,850 బ్రహ్మోత్సవ బహుమానం   
  • విరమణ పొందిన అర్చకుల సేవల పునరి్వనియోగం 
  • తిరుమలలోని వరాహస్వామి ఆలయ విమానానికి రూ.14 కోట్లతో రాగిరేకులపై బంగారు తాపడం పనులు ప్రారంభం
  • జమ్మూ సమీపంలోని మజీన్‌గ్రామం వద్ద శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం  
  • తిరుమల బూందీ పోటులో అగ్నిప్రమాదాల నివారణకు రూ.3.3 కోట్లతో అధునాతన థర్మోఫ్లూయిడ్‌ కడాయిల నిర్మాణం  
  • తిరుపతి జూపార్కు సమీపంలో రూ.14 కోట్లతో ఎస్వీ ప్రత్యేక ప్రతిభావంతుల శిక్షణ సంస్థ, రూ.34 కోట్లతో ఎస్వీ బదిర పాఠశాల హాస్టల్‌ భవనాల నిర్మాణానికి ఆమోదం.
  • బర్డ్‌ ఆస్పత్రి నూతన భవనంలో అదనపు ఆపరేషన్‌ థియేటర్ల నిర్మాణానికి రూ.8.43 కోట్లు మంజూరు
  • చెన్నైలో రూ.3.92 కోట్లతో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం  
  • టీటీడీ ఆధ్వర్యంలో చిన్నపిల్లల కోసం సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం 
  • టీటీడీ ఉద్యోగులకు  ఆరోగ్య పథకం (ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌) అమలు 
  • తిరుమల శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అమలు 
  • శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తులను విక్రయించరాదని నిర్ణయం 
  • తిరుమల శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠం, మహద్వారం తలుపులకు బంగారు తాపడం చేయించాలని నిర్ణయం
  • టీటీడీ హిందూ ధర్మ ప్రచారం కోసం కొత్తగా 6 ప్రచార రథాలు కొనుగోలు
  • తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సూర్యప్రభ వాహనానికి 11.766 కిలోల బంగారంతో తాపడం పనులు
  • తిరుపతి ఎస్వీ బాలమందిరంలో రూ.10 కోట్లతో అదనపు హాస్టల్‌ బ్లాక్‌ నిర్మాణం
  • తమిళనాడులోని ఊలందూరుపేటలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి శ్రీకారం
  • తిరుమలలో 50 మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తికి నిర్ణయం
  • తెలుగు రాష్ట్రాల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో నిర్మించాల్సిన 500 ఆలయాలను ఏడాదిలో పూర్తి చేసేలా తీర్మానం
  • గోవిందుడికి గో ఆధారిత నైవేద్యం అమలు
  • మూడు నెలల్లోపు ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానళ్ల ప్రసారాలు ప్రారంభించేలా చర్యలు
  • తిరుమలలోని హనుమంతుని జన్మస్థలం

అభివృద్ధికి నిర్ణయం

  • తిరుమలను గ్రీన్‌ హిల్స్‌గా ప్రకటించినందున త్వరలో ఎలక్ట్రిక్‌ బస్సుల ఏర్పాటు.
  • లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీలకు సుమారు 35.5 లక్షల అన్నప్రసాదం ప్యాకెట్లు పంపిణీ  
  • తిరుపతిలోని ఎస్వీ జూపార్క్‌లో వన్యప్రాణుల సంరక్షణ, వాటి ఆహారం కోసం రూ.50 లక్షలు ఆర్థికసాయం. 
  • శ్రీ పద్మావతి కోవిడ్‌ ఆసుపత్రిలో వెంటిలేటర్ల కొనుగోలు కోసం రూ.19 కోట్ల కేటాయింపు 
  • రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 22 జర్మన్‌ షెడ్లు ఏర్పాటు 
  • కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో టీటీడీ ఉద్యోగుల కోసం 140 అక్సిజన్‌బెడ్లు, 14 వెంటిలేటర్ల ఏర్పాటు 
  • రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లోని టీటీడీ కల్యాణ మండపాల్లో భక్తులకు శ్రీవారి లడ్డూప్రసాదం పంపిణీ. 
  • తిరుమల శ్రీవారి దర్శనానికి ముందస్తుగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో పొందిన భక్తులకు దర్శన తేదీలు మార్చుకునే వెసులుబాటు. రద్దు చేసుకుంటే నగదు రీఫండ్‌ పొందే సౌకర్యం.
  • లోక కల్యాణం కోసం సుందరకాండ పారాయణం, విరాటపర్వం వంటి ఆధ్యాతి్మక కార్యక్రమాల నిర్వహణ.

ఎంతో భాగ్యం 
దేవదేవుడికి సేవచేసే భాగ్యం మరోసారి దక్కడం ఎంతో సంతోషం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. రెండేళ్ల కాలంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. సామాన్య భక్తులకు సులభంగా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశాం. దళారీ వ్యవస్థని పూర్తిగా రూపుమాపాం. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలు నిర్మిస్తున్నాం. వారం, పది రోజుల్లో పాలకమండలి సభ్యుల నియామకం ఉంటుంది.
- వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ చైర్మన్‌

మరిన్ని వార్తలు