పదేళ్ల కష్టానికి ఫలితమిది

13 Mar, 2021 04:28 IST|Sakshi
మాట్లాడుతున్న నారాయణస్వామి. చిత్రంలో వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రెడ్డప్ప

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  

సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలో చంద్రగిరి నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పదేళ్లపాటు పడిన కష్టాలను కళ్లారా చూశామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రగిరి నియోజకవర్గంలో గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల అభినందన సభ శుక్రవారం జరిగింది. సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం చెవిరెడ్డి అలుపెరుగని పోరాటం చేశారని, ఆ పదేళ్ల కష్టానికి తగ్గ ఫలితాన్ని ప్రజలు కట్టబెట్టారని వివరించారు.

ఎంతటి విపత్కర పరిస్థితులున్నా ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారన్నారు. గడచిన 21 నెలల కాలంలో రూ.79 వేల కోట్లు ప్రజల ఖాతాల్లోకి నేరుగా జమ చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచీ సోనియాగాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నో కష్టనష్టాలకు గురి చేసిందని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఓర్చుకుని ప్రజల కోసం అవిశ్రాంత పోరాటం చేపట్టిన వైఎస్‌ జగన్‌ యూపీఏ చైర్‌పర్సన్‌ను ఢీకొట్టారన్నారు.  డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ రెడ్డెప్ప, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా మాట్లాడారు. 

మరిన్ని వార్తలు