ఆనందయ్య మందు: ‘ప్రజలు నమ్మకంతో తీసుకుంటున్నారు’

1 Jun, 2021 12:28 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో పంపిణీకి కసరత్తు ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆనందయ్య మందును ఆయుర్వేదిక్ మందుగా కేంద్ర, రాష్ట్ర ఆయుష్ సంస్థలు గుర్తించలేదని తెలిపారు. ఒకవేళ ఆయా సంస్థలు గుర్తింపు ఇస్తే టీటీడీ తరఫున పంపిణీ చేద్దామనుకున్న విషయం వాస్తవమే అని చెప్పారు. కానీ.. గుర్తింపు లేని కారణంగా టీటీడీ పంపిణీ చేయడం లేదని స్పష్టం చేశారు.

ప్రజలు నమ్మకంతో తీసుకుంటున్నారు కనుకే రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని వివరించారు. ఇప్పుడు అది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారమని, నమ్మకం ఉన్నవారు ఆనందయ్య మందు తీసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదని, ఈ విషయంలో మేం కల్పించుకోమని చెప్పారు. ఆనందయ్య మందు తెచ్చుకునేందుకు ప్రతి ఒక్కరు కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని అన్నారు.
చదవండి: ఆనందయ్య మందుల తయారీ ఇలా

మరిన్ని వార్తలు