పీలేరు : పీలేరు పట్టణంలో తాళం వేసిన ఇంటికి కన్నం వేసి.. బంగారు, నగదు అపహరించారు. స్థానిక అజంతా రోడ్డు మార్గంలో నివాసముంటున్న రాము కుటుంబ సభ్యులు సోమవారం ఇంటికి తాళం వేసుకుని బంధువుల ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం తిరిగి రాగా ఇంటిలో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ నరసింహుడు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. 1.50 లక్షల నగదు, 25 గ్రాముల బంగారు చోరీకి గురైనట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. వేలిముద్ర నిపుణులు వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.