మదనపల్లె సిటీ : పౌర్ణమి పురస్కరించుకుని ఏప్రిల్ 4న అరుణాచలానికి ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ 1,2 డిపో మేనేజర్లు మూరె వెంకటరమణారెడ్డి, ఆర్సీ నిరంజన్ తెలిపారు. అల్ట్రాడీలక్స్ సర్వీసులు నడుపుతామన్నారు. రానుపోను రూ.805 చెల్లించాలన్నారు. భక్తులు ముందుగానే టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకోవాలన్నారు.
శ్రీశైలం వెళ్లే భక్తులకు దర్శనం టిక్కెట్లు :
శ్రీశైలం వెళ్లే భక్తులకు దర్శనం టిక్కెట్లు ఇస్తున్నట్లు డీఎం ఆర్సి నిరంజన్ తెలిపారు. బుకింగ్ కౌంటర్లో బస్సు టిక్కెట్టుతో పాటు శీఘ్ర, అతి శీఘ్ర, స్పర్శ దర్శనం టిక్కెట్లు పొందవచ్చన్నారు. భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నేడు లక్కిరెడ్డిపల్లెకు జేసీ రాక
లక్కిరెడ్డిపల్లె : రాయచోటి–వేంపల్లె జాతీయ రహదారి ఏర్పాటుకు జరుగుతున్న పనులను పరిశీలించేందుకు గురువారం జేసీ తమీమ్ అన్సారియా లక్కిరెడ్డిపల్లె రానున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న వారితో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నట్టు ఇన్చార్జి తహసీల్దార్ నరసింహులు తెలిపారు.
26న రాజంపేటలో
మాలల సింహగర్జన
నందలూరు(రాజంపేట) : పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో ఈనెల 26న చేపట్టే మాలల సింహగర్జన విజయవంతం చేయాలని మాలల జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం నాగిరెడ్డిపల్లె అర్బన్లో మాలల జేఏసీ నేతలు సింహగర్జనపై విస్తృత ప్రచారం నిర్వహించారు. సింహగర్జన సందర్భంగా నాగిరెడిపల్లె సర్పంచ్ జంబు సూర్యనారాయణతో పలువురు దళిత ప్రజాప్రతినిధులు, నాయకులను ఆహ్వానించారు. కార్యక్రమంలో మాలల జేఏసీ నేతలు చౌడవరం సుబ్బనరసయ్య, లింగం సంజీవ్, పెనుబాల నాగసుబ్బయ్య, కాకిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
మదనపల్లె సిటీ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కాలేజీ (బాలికలు) 2023–24 సంవత్సరంలో 5 వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం (ఇంగ్లీషు మీడియం) ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ పి.కన్యాకుమారి తెలిపారు. ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుందన్నారు. ఆసక్తిగల బాలికలు ఈనెల 24లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 24 ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.