పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో ఏటా రూ.లక్ష కోట్లు

3 Dec, 2021 19:45 IST|Sakshi

సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులను పెంచడానికి, సకాలంలో ఉత్పత్తి ఖర్చులను తిరిగి పొందడానికి కేంద్రం తాజాగా కొత్త నిబంధనలను ప్రకటించింది. రాష్ట్రాలు, విద్యుత్‌ పంపిణీ సంస్థల నుంచి క్రమం తప్పకుండా ఇంధన కొనుగోలుకు హామీ ఇచ్చింది. దీనికోసం దేశంలో 2030 నాటికి 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అప్పటివరకూ ఏటా రూ.లక్ష కోట్లు (ట్రిలియన్‌) పెట్టుబడి పెట్టనుంది. 

నెలవారీ టారిఫ్‌లో సర్దుబాటు
2019 నుంచి సోలార్‌ మాడ్యూల్స్‌ ధర అత్యధికంగా పెరిగింది. దాదాపు అన్ని రకాల మాడ్యూల్స్‌ను చైనా నుండి దిగుమతి చేసుకుంటుండగా.. విద్యుత్‌ సంక్షోభం కారణంగా అక్కడి ఫ్యాక్టరీలు పరిమిత రోజుల్లో మాత్రమే నడుస్తున్నాయి. దానివల్ల దేశంలో పునరుత్పాదక విద్యుత్‌ జనరేటర్లకు వాటిని సకాలంలో అందించలేని పరిస్థితి ఏర్పడింది.

ఇది పునరుత్పాదక విద్యుత్‌ రంగం వృద్ధిపై ప్రభావం చూపుతోంది. ఇప్పుడు కేంద్రం మార్చిన నిబంధనల వల్ల నెలవారీ టారిఫ్‌లో సర్దుబాటును లెక్కించడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఉత్పత్తి సంస్థలు సకాలంలో ఖర్చులను రాబట్టుకోవచ్చు.

నిరంతరం గ్రిడ్‌కు అనుసంధానం
పునరుత్పాదక ఇంధన కర్మాగారాన్ని తప్పనిసరిగా నడపాల్సిన అవసరం లేదని నోటిఫైడ్‌ నియమాలు నిర్దేశించాయి. పవర్‌ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌లో ఏదైనా సాంకేతిక అవరోధం ఏర్పడినప్పుడు, విద్యుత్‌ గ్రిడ్‌ భద్రతా కారణాల వల్ల మాత్రమే నియంత్రిస్తారు.

మిగతా అన్ని సమయాల్లో గ్రిడ్‌కు అనుసంధానం చేయవచ్చు. ఇది పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు సహాయపడుతుందని విద్యుత్‌ మంత్రిత్వ శాఖ చెబుతోంది.

మరిన్ని వార్తలు