ఆ ఆలయంలోకి ప్రవేశిస్తే మనసులోని భావం తెలుస్తుంది

9 Nov, 2021 21:13 IST|Sakshi
విశేష అలంకరణలో నల్లనయ్య

సాక్షి,యడ్లపాడు(గుంటూరు): అది గొప్ప పుణ్యక్షేత్రం కాదు..అద్భుత కట్టడం అసలేకాదు. సాదాసీదాగా కనిపించే ఓ చిన్నగుడి. కాని ఆ గుడి ప్రాశస్త్యం గురించి తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ప్రాణమున్న మనిషి ఎలా భావాలను వ్యక్తం చేస్తాడో.. జీవకళ ఉట్టిపడే ఆ విగ్రహం కూడా అంతే. ఆ ఆలయంలోని దేవుడు మనం ఏ భావనతో లోపలికి ప్రవేశిస్తామో అదే భావనతో వారికి దర్శనం ఇవ్వడమే ఇక్కడి విశిష్టత. అర్థమయ్యేలా చెప్పాలంటే మనం అద్దం ముందు నిలుచుంటే ప్రతిబింబం ఎలా స్పష్టంగా కనిపిస్తుందో అచ్చం అలానే అన్నమాట.

కోట గ్రామంలోని విజయస్తూపం, కత్తులబావి ఏరియల్‌ వ్యూ

చెంఘీజ్‌ఖాన్‌పేటలోని వేణుగోపాలస్వామి గుడి
దుష్టశిక్షణ శిష్యరక్షణ గావించి ధర్మాన్ని ప్రభోదించేందుకు.. భూలోకాన బ్రహ్మాండాన్ని ఉద్దరించడానికి శ్రీమహావిష్ణువు ద్వాపర యుగాన ఎత్తిన ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణభగవానుడే ఆ కొవెలలో ‘చిన్నారి కన్నయ్య’లా కొలువై ఉన్నాడు. ఆ నల్లనయ్యను కన్నులారా చూడాలంటే ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు ప్రాంతంలోని చెంఘీజ్‌ఖాన్‌పేటకు వెళ్లాల్సిందే... అక్కడి వేణుగోపాలస్వామి ఆలయాన్ని దర్శించాల్సిందే...!

చెన్నవెన్న ముద్ద పద్యానికి ప్రతీగా చిన్నకృష్ణుని భారీ విగ్రహం, నవనీత బాలకృష్ణుని నిజరూపం

ప్రపంచంలో ఎక్కడా కానరాని విగ్రహం
చిన్ని కృష్ణుని బాల్యరూపాలతో అనేక మందిరాలు ఉన్నప్పటికీ ప్రపంచంలో ఎక్కడా కానరాని అదురైన విగ్రహం ఈ ఆలయంలోనే ఉండటం విశేషం. విగ్రహమంతటా అద్భుత శిల్పాచాతుర్యంతో స్వామివారి మధురరూపం దేదీప్యమై ప్రకాశిస్తుంది. ఇక్కడి స్వామివారి విగ్రహం..అందమైన బృందావనంలో వెన్నముద్దను కుడిచేత పట్టుకుని వెన్నదుత్తపై ఎడమ చేయిపెట్టి కుడిపాదం ముందుకు సాచి, ఎడమపాదాన్ని వెనుకకు వంచి నేలపై దోగాడుతున్న భంగిమలో..ముగ్థమనోహర రూపంతో ఆలయాన్ని దర్శించుకున్న భక్తులకు దర్శనమిస్తాడు ‘నవనీత బాలకృష్ణుడు’

కత్తులబావిగా ప్రసిద్ధి చెందిన నాటి గోపీనాథస్వామి ఆలయం

నాటి చరిత్ర ఇది
భారతదేశాన్ని పాలించిన చక్రవర్తుల్లో విజయనగర శ్రీకృష్ణదేవరాయలు ఒకరు. ఆయన ఆస్థానంలోని అష్టదిగ్గజ పండితుల ద్వారా ‘చేత వెన్నముద్ద’ కవితను వినినంతనే మనసులోనే ఆ చిన్న కృష్ణుని సుందరరూపాన్ని ఊహించుకుని పరవశించారు. ఆ కవితాక్షరాల్లోని భావాలకు సరిపోయేలా నల్లనయ్య మోహనరూపంతో విగ్రహాన్ని తయారు చేయాలని ఆజ్ఞాపించారట. రాయల అభిరుచికి తగ్గట్టు వెను వెంటనే ఉదయగిరి దుర్గంలో శ్రీకష్ణ దేవరాయల కవితాభిరుచికి తగ్గట్టుగా విగ్రహం, దానిని ప్రతిష్ఠించేందుకు ఆలయ నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లను ఆరంభించారు. ఆ సమయంలోనే శ్రీకృష్ణదేవరాయలు కొండవీడు దుర్గం మీదకు దండయాత్రకు ఉపక్రమించాడు. 

కత్తులబావిగా కథేంటీ..?
కొండవీడు హస్తగతం చేసుకున్న రాయల అధికారాన్ని అక్కడి పాలెగాళ్లు (సామంత రాజులు) అంగీకరించలేదు. ఆ సమయంలో గోపయమంత్రి గోపీనా«థుని ఆలయంలో లోతైన బావిని తవ్వించి అందులో కత్తుల్ని నాటించాడు. ఉత్సవం పేరిటా 72 మంది పాలెగాళ్లను ఆహ్వానించి స్వామి దర్శనంతరం వారిని అందులో పడేసి హతమార్చినట్లు ఓ కథనం వివవస్తుంది.

కొండవీడు జయించినప్పుడు శ్రీకృష్ణదేవరాయలు వేయించిన విజయస్తూపం

స్వప్నంలో సాక్షాత్కరించిన శ్రీకృష్ణుడు
మగత నిద్రలోకి జారిన ఆయన స్వప్నంలోకి శ్రీకృష్ణుడు దర్శనమిచ్చారట. తనను ఇక్కడే ప్రతిష్ఠించాలని, దానికి ప్రతిగా చిలకలూరిపేటకు సమీపాన ఉన్న పసుమర్రు గ్రామ పొలాల్లో పున్నాగ చెట్టుకింద భూస్థాపితమైన నృశింహస్వామిని తన కోరిక ప్రకారంగా ప్రతిష్ఠించుకోమని ఆదేశించాడట. నిద్రనుంచి మేల్కోన్న జమీందారు స్వామిని ఆ ప్రాంతంలోనే అంగరంగ వైభవంగా రెండోసారి ప్రతిష్ఠింపజేశారు. 

స్వామితో ఊరికి లభించిన ఖ్యాతి 
నిత్యం ధూపదీప నైవేద్యాలు, ఉత్సవాలు జరిపించాలంటూ 500 ఎకరాల మాన్యం భూమిని ఇచ్చారు. ఆ మాన్యం భూముల్లో పూయించిన పూలతోనే అప్పట్లో పూజలు జరిగేవి. ఆ పావనమూర్తి కొలువు దీరిన ఆ పవిత్ర ప్రాంతమే నేటి చెంఘీజ్‌ఖాన్‌పేట గ్రామం. ఆనాటి నుంచి ఈ దేవాలయం భక్తుల ఆదరణతో విరాజిల్లుతూ.. ప్రాచీన చరిత్రకు, ఆధ్యాత్మిక ప్రాంతంగా వెలుగొందుతుంది.

చదవండి: చీరమేను: ఆహా అద్భుత రుచి.. తినండి మైమరిచి..ధరెంతో తెలుసా?

మరిన్ని వార్తలు