టీడీపీ సభ్యుల ఓవరాక్షన్‌..  మండలి చైర్మన్‌ మోషెన్‌ రాజుపై ప్లకార్డులు విసిరి..

24 Mar, 2022 12:40 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల్లో టీడీపీ సభ్యుల తీరు మారడం లేదు. 12వ రోజు సమావేశాల్లో భాగంగా శాసన మండలిలోనూ టీడీపీ సభ్యులు ఓవరాక్షన్‌ చేశారు. మండలిలో సభా కార్యకలాపాలను ఆటంకపరిచారు. విజిల్స్‌ వేస్తూ, చిడతలు వాయిస్తూ టీడీపీ మండలి సభ్యులు దిగజారి ప్రవర్థించారు.  ఈ సందర్భంగా వారి తీరుపై చైర్మన్ మోషెన్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘సభలో ఇలాంటివి చేయడం మంచిది కాదు. సభకు చిడతలు, విజిల్స్ ఎందుకు తెచ్చారు. సభలో చిడతలు వాయించడం ఏంటి..?. సభా గౌరవాన్ని కాపాడే బాధ్యత మీ మీద లేదా?. భజన చేయడం మంచి పద్ధతి కాదు. వెల్‌లోకి వచ్చి మాట్లాడే హక్కు మీకు లేదు. మీ సీట్లలో మీరు కూర్చొని మాట్లాడండి. టీడీపీ సభ్యులు కావాలనే గొడవ చేస్తున్నారు.. సభా సమయాన్ని వృద్దా చేయొద్దని మొదటి రోజు నుంచి చెబుతున్నా’ అని అన్నారు.

వారు ఎంతకూ తీరు మార్చుకోకపోవడంతో టీడీపీ సభ్యులను ఈ ఒక్కరోజు చైర్మన్‌ సస్పెండ్ చేశారు. దీంతో టీడీపీ సభ్యుడు దీపక్ రెడ్డి పోడియం పైకి ఎక్కడానికి దూసుకెళ్లారు. దీంతో ఆయనను మార్షల్స్ అడ్డుకున్నారు. సస్పెండ్ చేస్తే ఈ దౌర్జన్యం ఏంటి అని చైర్మన్ మోషెన్ రాజు టీడీపీ సభ్యులను ప్రశ్నించారు. ఈ క్రమంలో మోషెన్ రాజుపై ప్లకార్డులు విసిరి టీడీపీ సభ్యులు బయటకు వెళ్లారు. సస్పెండైన వారిలో అర్జునుడు, అశోక్‌ బాబు, దీపక్‌ రెడ్డి, ప్రభాకర్‌, రామ్మోహన్‌, రామారావు, రవీంద్రనాథ్‌ ఉన్నారు. 

ఇది చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా భయం.. థియేటర్‌లో ఇనుప కంచెలు

మరిన్ని వార్తలు