వస్త్ర రంగం: ఏపీలో ఉన్న మినీ ముంబై ఏదో తెలుసా?

11 Oct, 2021 19:42 IST|Sakshi

కావలి రూరల్‌: దేశవ్యాప్తంగా వస్త్ర రంగంలో ముంబైదే పైచేయి.. అయితే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఆ స్థానం నెల్లూరు జిల్లా కావలికే దక్కింది. దీంతో మినీ ముంబైగా పేరు గాంచింది. 1930.. దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచే వస్త్ర రంగంలో కావలి కీలకంగా ఉండేది. అప్పట్లో వస్త్రాలకు సంబంధించిన రా మెటీరియల్‌ (వస్త్రాల బ్లీచింగ్, నీలి రంగు) లాంటి ముడి పదార్ధాలను కావలిలోనే తయారు చేసి సముద్ర మార్గం ద్వారా లండన్‌కు పంపేవారని వాటి ఆనవాళ్లుగా పెద్ద పెద్ద తయారీ తొట్టేలు గత 30 సంవత్సరాల క్రితం వరకు ఉండేవని ప్రచారం. (చదవండి: కర్రల సమరం: ‘గట్టు’ మీద ఒట్టు!

1933వ సంవత్సరంలోనే కావలి ట్రంకు రోడ్డు వెంబడి 100 వస్త్ర దుకాణాలు ఉండేవని అవి కాస్త ప్రస్తుతం ప్రధానంగా 4 వస్త్ర మార్కెట్లు, 2 గార్మెంట్లు, 1 తయారీ పరిశ్రమ, 500లకు పైగా వస్త్ర దుకాణాలు ఉండటంతో ఇక్కడ అన్నీ రకాల వస్త్రాలు హోల్‌సేల్‌ ధరలకే లభిస్తూ చూపరులను ఆకట్టుకునేలా ఆకర్షణీయంగా క్వాలిటీతో కూడిన వస్త్రాలు అందుబాటులో ఉంటాయి.

ప్రధానంగా కావలి నడిబొడ్డులో రైలు మార్గం, జాతీయ రహదారి ఉండటంతో వ్యాపారాలకు అనుగుణంగా సుదూర ప్రాంతాలైన ముంబాయి, అహ్మాదాబాద్, కలకత్తా, సూరత్, వారణాసి, చెన్నై వంటి మహా నగరాల నుంచి నేరుగా పరిశ్రమల నుంచి డీలర్‌ షిప్‌ పొంది నాణ్యమైన వస్త్రాలను దిగుమతి చేసుకుని.. దేశంలోని పలు రాష్ట్రాలకు కావలి నుంచే ఎగుమతులు జరుగుతుంటాయి. వస్త్ర వ్యాపార రంగంపై దాదాపు 15 వేల మందికి పైగా ఆధారపడి జీవిస్తుంటారు. వస్త్ర రంగంలో కావలిలో సంవత్సరానికి సరాసరి రూ.500 నుంచి 800 కోట్లుపైగా అమ్మకాలు సాగిస్తూ నిరుద్యోగులకు జీవనోపాధి కల్పిస్తున్నారు. నగరాలలోని పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌ లేకపోయిన క్వాలిటీ వస్త్రాలకు కావలి పేరుగడించి ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటుంది. 

మరిన్ని వార్తలు