కొరిటెపాడు(గుంటూరు): ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తో పప్పుశనగ కొనుగోళ్ల కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని ఏపీ మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ ఆర్.జె.కృష్ణారావు కోరారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడారు. క్వింటా రూ.5,335 ప్రకారం 8 కేంద్రాల ద్వారా పప్పు శనగ కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. మంగళగిరి, తాడికొండ, ఫిరంగిపురం, గుంటూరు, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమానులలో ఆయా రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఎం యాప్లో 456 మంది రైతుల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. వ్యర్ధ పదార్ధాలు ఒక శాతానికి మించి ఉండకూడదని, తేమ 14 శాతం మించి ఉండకూడదని వెల్లడించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి తీసుకువచ్చిన పప్పుశనగను కొనుగోలు చేసి ఆన్లైన్ ద్వారా రైతుల ఖాతాల్లోకి చెల్లింపులు చేస్తామని తెలిపారు.