ఆర్‌సీఎఫ్‌లో 10% విక్రయం

4 Jan, 2021 06:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని మరో సంస్థ రాష్ట్రీయ కెమికల్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌)లో 10 శాతం వాటాలను విక్రయించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ ప్రక్రియ నిర్వహణ కోసం మర్చంట్‌ బ్యాంకర్లు, లీగల్‌ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. మర్చంట్‌ బ్యాంకర్లు జనవరి 28 నాటికి, లీగల్‌ అడ్వైజర్లు 29 నాటికి బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో కేంద్రానికి 75 శాతం వాటాలు ఉండగా, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మార్గంలో 10 శాతాన్ని విక్రయించాలని భావిస్తోంది. శుక్రవారం నాటి ఆర్‌సీఎఫ్‌ షేరు ముగింపు ధర రూ. 54 ప్రకారం ఈ వాటాల విలువ సుమారు రూ. 300 కోట్లుగా ఉంటుంది.

బీఈఎంఎల్‌లో వాటాల విక్రయానికి బిడ్ల ఆహ్వానం
ప్రభుత్వ రంగ దిగ్గజం బీఈఎంఎల్‌లో 26 శాతం వాటాల విక్రయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా బిడ్లను ఆహ్వానించింది. బిడ్డర్లు మార్చి 1 లోగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) దాఖలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల విభాగం (దీపం) వెల్లడించింది. శుక్రవారం బీఈఎంఎల్‌ షేరు ధర రూ. 974 ప్రకారం ఈ వాటాల విలువ సుమారు రూ. 1,000 కోట్లుగా ఉంటుంది. డిఫెన్స్, రెయిల్, విద్యుత్, మైనింగ్, ఇన్‌ఫ్రా తదితర రంగాల్లో బీఈఎంఎల్‌ కార్యకలాపాలు సాగిస్తోంది. 2020 మార్చి 31 నాటికి రూ. 9,795 కోట్ల ఆర్డర్లు చేతిలో ఉన్నాయి. సంస్థలో కేంద్రానికి 54.03 శాతం వాటాలు ఉండగా..  కొనుగోలుదారులకు 26 శాతం వాటాలతో పాటు యాజమాన్య హక్కులు కూడా బదలాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.

మరిన్ని వార్తలు