సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ కలకలం..భారత్‌లో మరో బ్యాంక్‌ను మూసివేస్తున్నారంటూ రూమర్స్‌!

12 Mar, 2023 12:23 IST|Sakshi

ప్రపంచ దేశాల్లో ఎన్నో టెక్నాలజీ స్టార్టప్‌ (భారత్‌లో 21 స్టార్టప్‌)ల్లో పెట్టుబడులు పెట్టి, వాటికి బాసటగా నిలిచిన అక్కడి సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ) నిండా మునిగింది. 2008 లేమాన్‌ బ్రదర్స్‌ ఆర్థిక సంక్షోభం తర్వాత మరో పెద్ద బ్యాంక్‌ దివాళాకు కారణమైంది. ఇప్పుడీ పరిణామాలతో అమెరికా నుంచి 13 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న  ముంబైకి చెందిన శ్యామ్‌రావు విఠల్‌ కో-ఆపరేటీవ్‌ బ్యాంక్‌ (ఎస్‌వీసీ) బ్యాంకు దివాళా తీస్తుందనే పుకార్లు కలకలం రేపుతున్నాయి.   

ఎక్కడో అమెరికాలో ఉన్న ఎస్‌వీబీ బ్యాంక్‌ మూతపడితే.. భారత్‌లో ఉన్న బ్యాంక్‌కు ఆర్ధిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే పుకార్లతో సదరు బ్యాంక్‌ స్పందించింది. పుకార్లను కొట్టిపారేసింది. ఈ రూమర్స్‌ను స్ప్రెడ్‌ చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు ట్వీట్‌ చేసింది.

భారత్‌కు చెందిన బ్యాంక్‌ మూత పడిందంటూ
మనదేశానికి చెందిన ఎస్‌వీసీ బ్యాంక్‌ 1906 నుంచి ముంబై కేంద్రంగా వినియోగదారులకు బ్యాంకింగ్‌ సేవల్ని అందిస్తోంది. 11 రాష్ట్రాల్లో 198 బ్రాంచీలు, 214 ఏంటీఎంలు, 2300 మంది ఉద్యోగులతో 100 ఏళ్లు పూర్తి చేసుకొని ఎన్‌ఏఎఫ్‌సీయూబీ అవార్డ్‌ దక్కించుకుంది. 116 ఏళ్ల చరిత్ర ఉన్న ఎస్‌వీసీ బ్యాంక్‌ ప్రస్తుతం రూ.31,500 కోట్ల బిజినెస్‌ చేస్తుండగా ఆర్ధిక సంవత్సరం 2021-22లో రూ.146 కోట్ల నెట్‌ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే బ్యాంక్‌ మూతపడిందంటూ రూమర్స్‌ వచ్చాయి. దీంతో ఆబ్యాంక్‌ కస్టమర్లు ఆందోళన గురయ్యారు. ఆ బ్యాంకులో దాచిన డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంక్‌ బ్రాంచీలను సంప‍్రదించారు.

అది ఎస్‌వీబీ బ్యాంక్‌.. మనది ఎస్‌వీసీ బ్యాంక్‌
అయితే కస్టమర్ల ఆందోళనతో ఎస్‌వీసీ బ్యాంక్‌ అధికారికంగా ఓ నోటీసును విడుదల చేసింది. ఆ నోటీసుల్లో ఉన్న వివరాల మేరకు..అమెరికాలో ఉన్న దిగ్గజ బ్యాంక్‌ మూత పడింది. అది సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (svb) కాగా.. మనది  శ్యామ్‌రావు విఠల్‌ కో-ఆపరేటీవ్‌ బ్యాంక్‌ ( svc) అని స్పష్టత ఇచ్చింది. ఇక ఎస్‌వీసీపై వస్తున్న తప్పుడు ప్రచారంతో .. కస్టమర్లు ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదని తెలిపింది. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు హెచ్చరించింది. 


ఇది వాట్సాప్‌ యూనివర్సిటీ దుస్థితి
ఆ వివరణతో ఎస్‌వీసీ కస్టమర్లు ఊపిరి పీల్చుకున్నారు. సదరు బ్యాంకుపై వస్తున్న రూమర్లకు నెటిజన్లు తమదైన శైలిలో ట్వీట్‌లు చేస్తున్నారు. ZyppElectric సీఈవో ఆకాష్‌ గుప్తా మాట్లాడుతూ.. తర్వాత ఎస్‌ఎల్‌బీ(సంజయ్ లీలా భన్సాలీ) ప్రకటన విడుదల చేయొచ్చని ట్వీట్‌లో పేర్కొనగా.. భారత్‌ అద్భుతమైందని మరో యూజర్‌ వెటకారంగా కొనియాడగా ..భారతీయుల్లారా..వాట్సాప్ యూనివ‌ర్సిటీ దుస్థితి ఇలా ఉందని కామెంట్‌ చేశాడు. ఎస్‌వీసీ ముఖ్యమైన వివరణ ఇచ్చిందంటూ మరో యూజర్‌ కృజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు