దేశంలో 1330 విదేశీ కంపెనీల మూత

11 Feb, 2023 18:27 IST|Sakshi

న్యూఢిల్లీ: విదేశీ కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు కలిపి సుమారు 1330 కంపెనీలు గడిచిన మూడేళ్ల కాలంలో భారత్‌లో కార్యకలాపాలు నిలిపివేసినట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ రాజ్యసభకు వెల్లడించారు. మరోవైపు గత మూడేళ్లలో 4,994 విదేశీ కంపెనీలు లేదా వాటి సబ్సిడరీలు భారత్‌లో కార్యకాలాపాలు ఆరంభించినట్టు చెప్పారు.

దేశం మొత్తం మీద 17,432 విదేశీ కంపెనీలు, వాటి సబ్సిడరీలు ప్రస్తుతం నిర్వహిస్తున్నట్టు రాజ్యసభకు వెల్లడించారు. కార్యకలాపాలు మూసివేయడం అన్నది ఆయా కంపెనీల వ్యక్తిగత వాణిజ్య నిర్ణయాలుగా మంత్రి పేర్కొన్నారు. కార్యకలాపాలు లాభసాటిగా లేకపోవడం, వనరుల లభ్యత, మార్కెట్‌ పరిమాణం, సదుపాయాలు, రాజకీయ, స్థూల ఆర్థిక వాతావరణం తదితర అంశాలు కంపెనీల నిర్ణయాలను ప్రభావితం చేస్తాయన్నారు.

మరో ప్రశ్నకు వాణిజ్య శాఖ సహాయ మంత్రి  అనుప్రియ పటేల్‌ స్పందిస్తూ.. భారత్‌–చైనా మధ్య వాణిజ్య అంతరం 2021–22లో 73 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని, ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 44 బిలియన్‌ డాలర్లుగానే ఉన్నట్టు తెలిపారు. 

మరిన్ని వార్తలు