ఇప్పుడు సిమెంట్‌ వంతు..భారీగా పెరగనున్న ధరలు..! ఒక బస్తాపై..

21 Apr, 2022 12:23 IST|Sakshi

రష్యా-ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో నిత్యావసర వస్తువుల, ఇంధన ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులతో సిమెంట్‌ ధరలు కూడా భారీగా అవకాశం ఉన్నట్లు క్రిసిల్‌ ఒక నివేదికలో పేర్కొంది. 

పెరిగిన ఇన్‌పుట్‌ ఛార్జీలు..!
సిమెంట్‌ తయారీలో ఇన్‌పుట్‌ ఛార్జీలు పెరగడంతో ఆయా కంపెనీలు ఖర్చులను తీవ్రంగా భరించడం మొదలుపెట్టాయి. దీంతో మార్జినల్‌ లాభాలను పొందడంలో ఆయా కంపెనీలకు కష్టతరంగా అయ్యే అవకాశం ఉండడంతో కంపెనీలు ఈ నెలలో ఒక్కో బ్యాగ్‌పై రూ. 25 నుంచి  రూ. 50 వరకు  సిమెంట్‌ బ్యాగ్‌ ధరలు పెంచే అవకాశం ఉందని క్రిసిల్‌ పేర్కొంది.  

పెరిగిన రవాణా ఖర్చులు..!
మార్చిలో ముడి చమురు బ్యారెల్‌ ధరలు సగటున 115 డాలర్లకు పెరిగిన విషయం తెలిసిందే.  రష్యా-ఉక్రెయిన్ వివాదం, ఆస్ట్రేలియాలోని కీలక మైనింగ్ ప్రాంతాల్లో వాతావరణ అంతరాయాలు,  దేశీయ డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం వంటి వివిధ కారణాల వల్ల అంతర్జాతీయ బొగ్గు ధరలు కూడా పెరిగాయని క్రిసిల్‌ పేర్కొంది. విద్యుత్, ఇంధన ధరల పెరుగుదల ఫలితంగా సరుకు రవాణా ఖర్చు పెరిగింది, ఇది సిమెంట్ రవాణాలో 50 శాతం వాటాలను కలిగి ఉంది. బల్క్ డీజిల్ ధరలు లీటరుకు రూ.25 పెంచారు, రిటైల్ డీజిల్ ధరలు కూడా పెరిగాయి. ఇవి సిమెంట్‌ ధరల పెంపుకు కారణాలుగా ఉన్నాయని క్రిసిల్‌ వెల్లడించింది.  క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ హేతల్ గాంధీ ప్రకారం...గత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో సిమెంట్ డిమాండ్ సంవత్సరానికి 20 శాతం పెరగగా...అకాల వర్షాలు, ఇసుక సమస్యలు, కార్మికుల లభ్యత కారణంగా రెండో భాగంలో ఊహించని విధంగా మందగమనాన్ని ఎదుర్కొంది.

స్థిరంగా డిమాండ్‌..!
వచ్చే ఆర్థిక సంవత్సరంలో...సిమెంట్‌కు డిమాండ్‌ 5-7 శాతం వద్ద స్థిరంగా ఉండనుంది, మౌలిక సదుపాయాలతో పాటు టైర్-2, టైర్-3 నగరాల నుంచి సరసమైన గృహాల డిమాండ్‌తో ధరలు స్ధిరంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ, అధిక నిర్మాణ ఖర్చులు సిమెంట్‌ డిమాండ్ పెరుగుదలను పరిమితం చేసే అవకాశం లేకపోలేదని హేతల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు.  

చదవండి: సిమెంటుకు పెరగనున్న డిమాండ్‌ 

మరిన్ని వార్తలు