నా 30 ఏళ్ల అనుభవంలో తొలిసారి: ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ ఆశ్చర‍్యం, ప్రశంసలు

18 Aug, 2022 15:32 IST|Sakshi

సాక్షి,ముంబై: 5జీ స్పెక్ట్రం కొనుగోలుకు సంబంధించి ఎయిర్‌టెల్‌ ముందస్తు చెల్లింపులు చేసిన కొన్ని గంటల్లోనే సంబంధిత స్పెక్ట్రమ్‌ను  సంస్థకు కేటాయించడం విశేషంగా నిలిచింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించినతీరుపై ఎయిర్‌టెల్ వ్యవస్థాపకుడు,  చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ప్రశంసలు కురిపించారు. ఊహించిన దానికంటే ముందుగానే 4జీతో పోలిస్తే 10 రెట్ల వేగంగో 5జీ సేవలు దేశంలో అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఆ మేరకు ఆయన ట్విటర్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు

ఎయిర్ టెల్ చెల్లింపులు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే 5జీ స్పెక్ట్రం కేటాయించినట్టు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం నుంచి లేఖ అందిందని ఎయిర్‌టెల్‌ చైర్మెన్ సునీల్ భారతి మిట్టల్ సంతోషం ప్రకటించారు. నిర్ణీత ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ల కేటాయింపు లేఖ చేతికందిందని, ఇచ్చిన హామీ మేరకు స్పెక్ట్రమ్‌తోపాటు ఇ బ్యాండ్‌ కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. బహుశా చెల్లింపులు జరిపిన రోజే ఇలా లేఖ అందడం ఆశ్చర్యం కలిగించిందనీ, చరిత్రలో తొలిసారి అని పేర్కొన్నారు. తన 30 అనుభవంలో తొలిసారి ఇలా జరిగిందంటూ ఉబ్బితబ్బిబ్బవుతునన్నారు. ఎలాంటి గందరగోళం, వివరాల ఆరాలు, ఆఫీసుల చుట్టూ తిరగడాలు ఈ బాదర బందీ ఏమీ లేకుండానే ఇది సాధ్యమైందని తెలిపారు. ఇదంతా టెలికాం శాఖ నాయకత్వ కృషి అని, ఈజీ బిజినెస్‌కు ఇది నిదర్శనమన్నారు. ప్రస్తుతం ఈ మార్పే అవసరమని ఇదే మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఇంధనంగా తోడ్పడు తుందంటూ మిట్టల్‌  అభిప్రాయపడ్డారు.

టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు స్పెక్ట్రమ్ కేటాయింపు లేఖలను జారీ చేసినట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది, ఎయిర్‌టెల్‌ ఈ నెలాఖరులో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.షెడ్యూల్ కంటే 4 సంవత్సరాల ముందుగానే బకాయిలను చెల్లించిందని కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ కూ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేసారు. "5G అప్‌డేట్: స్పెక్ట్రమ్ అసైన్‌మెంట్ లెటర్ జారీ  చేశాం. 5G లాంచ్‌కు సిద్ధం కావాలని  సర్వీసు ప్రొవైడర్లను అభ్యర్థిస్తున్నాను" అని పేర్కొన్నారు. కాగా 5జీ స్పెక్ట్రమ్ బకాయిల కోసం టెలికాం కంపెనీలు రూ.17,873 కోట్లకు పైగా చెల్లించాయి. ఇందులో దాదాపు సగం  నాలుగేళ్లకు చెందిన ముందస్తు చెల్లింపులు రూ. 8,312.4 కోట్లు  భారతీ ఎయిర్‌టెల్ చెల్లించింది.

మరిన్ని వార్తలు