కమర్షియల్‌ బొగ్గు గనుల వేలం..బిడ్స్‌ దాఖలు చేసిన 31 సంస్థలు!

29 Jun, 2022 13:47 IST|Sakshi

న్యూఢిల్లీ:  కమర్షియల్‌ బొగ్గు గనుల వేలంలో 31 సంస్థలు బిడ్స్‌ దాఖలు చేసినట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 24 గనులకు సంబంధించి బిడ్లను అందించిన సంస్థల్లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, వేదాంత, ఎన్‌ఎల్‌సీ ఇండియా, జిందాల్‌ పవర్, భారత్‌ అల్యూమినియం, బిర్లా కార్పొరేషన్, జైప్రకాష్‌ పవర్‌ వెంచర్స్, రుంగ్తా మెటల్స్, గోదావరి పవర్‌ అండ్‌ ఇస్పాత్‌  కంపెనీలు ఉన్నాయి.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ మార్గాల్లో జరిగిన మూడు రౌండ్ల వేలంలో మొత్తం 31 సంస్థలు 38 బిడ్స్‌ సమర‍్పించినట్లు బొగ్గు మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  కమర్షియల్‌ మైనింగ్‌ కోసం 41 బొగ్గు గనుల వేలాన్ని 2020లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

భారత్‌లో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నందున గనుల వేలం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇప్పటివరకు, ప్రభుత్వం దాదాపు 47 బొగ్గు గనులను ప్రైవేట్‌ కంపెనీలకు వేలం వేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం బొగ్గు ఉత్పత్తి రికార్డు స్థాయి 777 మిలియన్‌ టన్నులను తాకింది. వార్షికంగా 8.55 శాతం వృద్ధిని సాధించింది.  

మరిన్ని వార్తలు