ప్రతి పది మందిలో నలుగురికి టోపీ! సర్వేలో విస్తుగొలిపే విషయాలు

4 May, 2023 10:58 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో 39 శాతం మంది గడిచిన మూడేళ్లలో ఆర్థిక మోసాల బారిన పడినట్టు లోకల్‌ సర్కిల్స్‌ నిర్వహించిన సర్వేలో తెలిసింది. అంటే ప్రతి పది మందిలో నలుగురు మోసపోయినట్టు తెలుస్తోంది. ఇలా మోసపోయిన వారిలో కేవలం 24 శాతం మందికే తిరిగి ఆ మొత్తం చేరింది. సర్వే వివరాలను లోకల్‌ సర్కిల్స్‌ విడుదల చేసింది.

► 23 శాతం మంది క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు మోసాలను ఎదుర్కొన్నట్టు తెలిపారు.
► 13 శాతం మంది కొనుగోళ్లు, అమ్మకాలు, ప్రకటనల వెబ్‌సైట్ల ద్వారా మోసపోయారు.
► 10 శాతం మంది వెబ్‌సైట్లలో కొనుగోళ్లకు డబ్బులు చెల్లించినా, అవి డెలివరీ చేయలేదు.  
► 10 శాతం మంది ఏటీఎం మోసాల బారిన పడగా, 10 శాతం మంది బ్యాంకు మోసాలు, 16 శాతం మంది ఇతర మోసాల బారిన పడినట్టు తెలిసింది.

► దేశవ్యాప్తంగా 331 జిల్లాల్లో 32,000 మంది అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. 66 శాతం పురుషులు కాగా, 34 శాతం మంది మహిళలు ఉన్నారు.
► మోసపోయిన మొత్తం తిరిగి తాము వెనక్కి పొందామని 24 శాతం మంది తెలిపారు. 70 శాతం మంది తమ ఫిర్యాదులకు ఇంత వరకు పరిష్కారం లభించలేదని చెప్పారు.
► సంబంధిత ప్లాట్‌ఫామ్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా 18%మంది మోసపోయిన మొత్తాన్ని వెనక్కి పొందగా, 6 శాతం మంది అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన మొత్తాన్ని రాబట్టుకున్నారు.

► 41 శాతం మంది తమ ఫిర్యాదు అపరిష్కృతంగా ఉందని చెప్పగా, 17 శాతం మంది ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. ఇక 12 శాతం మంది ఫిర్యాదు చేయకూడదనే నిర్ణయం తీసుకోగా, 6 శాతం మంది ఏమీ చెప్పలేదు.

► సర్వేలో పాల్గొన్న 30% కుటుంబాల్లో కనీసం ఒక సభ్యుడు మోసపోగా, 9 శాతం కుటుంబాల్లో ఒకరికి మించి బాధితులుగా మారారు.  
► 57 శాతం మంది ఆర్థిక మోసాల నుంచి తప్పించుకున్నామని తెలిపారు.
► కాస్త ఊరటనిచ్చే విషయం ఏమిటంటే 2022లో మోసపోయిన, తిరిగి వెనక్కి పొందిన వారు 17 శాతంగా ఉంటే, 2023లో ఇలా వెనక్కి పొందిన వారి శాతం 24 శాతానికి చేరింది.

మరిన్ని వార్తలు