Shweta Menon: లింక్‌ క్లిక్‌ చేసి లక్షలు నష్టపోయిన 40 మంది.. బాధితుల్లో ప్రముఖ నటి!

6 Mar, 2023 10:46 IST|Sakshi

సైబర్‌ మోసాలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. కొంచెం ఏమరుపాటుగా ఉన్నా ఖాతాలోని సొమ్మంతా ఊడ్చేస్తారు. సామాన్యులే కాదు సెలెబ్రిటీలు, ప్రముఖులు కూడా ఈ సైబర్‌ మోసాలకు గురవుతున్నారు.  

ఇలాగే ముంబైలోని ఒక ప్రైవేట్ బ్యాంక్‌కు చెందిన కస్టమర్‌లు ఏకంగా 40 మంది తమ కేవైసీ, పాన్ వివరాలను అప్‌డేట్ చేయాలంటూ వచ్చిన లింక్‌పై క్లిక్ చేసి మోసానికి గురయ్యారు. మూడు రోజుల్లో లక్షల రూపాయలు నష్టపోయారు. బ్యాంక్ కస్టమర్‌లు తమ గుర్తింపును ధ్రువీకరించుకోవడానికి కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి. అయితే ఇందుకోసం బ్యాంకులు ఇలా మెసేజ్‌ల ద్వారా లింక్‌లు పంపవు. సంబంధిత బ్యాంక్‌ అఫీషియల్‌ వెబ్‌సైట్‌లు లేదా యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ఈ-కేవైసీ చేసుకోవచ్చు. అలాగే నేరుగా బ్యాంక్‌ బ్రాంచ్‌లకు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోవచ్చు. 

ఇదీ చదవండి: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్‌! రూ.295 కట్‌ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి..

ప్రస్తుతం అన్ని బ్యాంకుల్లోనూ పాన్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవడం అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో వివరాలను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని, లేకపోతే బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందని సైబర్‌ నేరగాళ్లు ఫిషింగ్ లింక్‌లతో ఎస్సెమ్మెస్‌లు పంపుతున్నారు. కస్టమర్లు కంగారు పడి వెంటనే లింక్‌ క్లిక్‌ చేస్తున్నారు. దీంతో నకిలీ వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది. అందులలో కస్టమర్ ఐడీ, పాస్‌వర్డ్‌ తదితర రహస్య వివరాలను నమోదు చేసి లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు.

 

ఇలాంటి మోసాలకు గురై డబ్బు పోగుట్టుకున్నట్లు ఫిర్యాదు చేసిన 40 మంది బాధితుల్లో ప్రముఖ నటి శ్వేతా మీనన్ కూడా ఉన్నారు. ఇటీవల తనకు ఓ వచ్చిందని, అది బ్యాంక్‌ నుంచే వచ్చిందని నమ్మి లింక్‌ను క్లిక్ చేశానని ఆమె తెలిపారు. ఇలా క్లిక్‌ చేసి తన కస్టమర్ ఐడీ, పాస్‌వర్డ్‌, ఓటీపీ నమోదు చేశానని పోలీసులకు ఆమె వివరించారు. ఇంతలో బ్యాంక్ అధికారినంటూ ఒక మహిళ ఫోన్ చేసి తన మొబైల్ నంబర్‌కు వచ్చిన మరో ఓటీపీని నమోదు చేయాలని చెప్పడంతో అలాగే చేశానని, ఆ తర్వాత తన ఖాతా నుంచి  రూ.57,636 కట్‌ అయిందని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు