సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు భారతీయులు గుడ్‌బై, దేశంలో 'ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌' సునామీ!

13 Jun, 2022 21:44 IST|Sakshi

కరోనా తెచ్చిన సరికొత్త విప్లవంతో ఐటీ ఉద్యోగులు వినూత్న రీతిలో తమకు నచ్చిన జాబ్‌కు జైకొడుతున్నారు. నచ్చలేదంటే లక్షల ప్యాకేజీ ఇస్తామన్నా లైట్‌ తీసుకుంటున్నారు. మరికొందరు నేను ఉద్యోగం చేసేదేంది. సొంత కంపెనీ పెట్టి పది మందికి ఉపాధి కల్పించాలనే ధోరణితో చేస్తున్న ఉద్యోగాలకు రిజైన్‌ చేయడం, లేదంటే చేస్తున్న ఉద్యోగం వదిలేసి కొత్త రంగంపై అడుగులు వేస్తున్నారు. దీంతో భారత్‌లో దిగ్రేట్‌ రిజిగ్నేషన్‌ కొనసాగుతున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

క్లౌడ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ప్రొవైడర్‌ డిజిటల్‌ ఓషన్‌ ప్రకారం.. మహమ్మారి సమయంలో ఉద్యోగాల్ని అంటిపెట్టుకొని ఉన్న 42 శాతం సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లు ఈ సంవత్సరం చేస్తున్న జాబులకు రిజైన్‌ చేయాలని, లేదంటే మరో జాబ్‌కు షిప్ట్‌ అయ్యే యోచనలో ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు, వన్‌ ఇయర్‌పైగా వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న డెవలపర్‌లలో నాలుగింట ఒక వంతు మంది గత సంవత్సరంలో కొత్త ఉద్యోగాల్ని ఎంపిక చేసుకున్నట్లు 'కరెంట్ సర్వే' పేరుతో నివేదిక పేర్కొంది.

"సంవత్సరం కంటే ఎక్కువ అనుభవం ఉన్న డెవలపర్‌లలో 27 శాతం మంది గత సంవత్సరంలో కొత్త ఉద్యోగం చేసేందుకు మొగ్గు చూపారు.15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న ఐదుగురు డెవలపర్‌లలో ఒకరు గత సంవత్సరంలో కొత్త ఉద్యోగం చేయడం ప్రారంభించినట్లు తేలింది. 

డెవలపర్‌లు ఉద్యోగాలు మారడానికి పనితగ్గ వేతనం, రిమోట్ లేదా సౌకర్యంగా ఉండే వర్క్‌ ప్లేస్‌లో పనిచేసేందుకు ఇష్టపడడమే ప్రధాన కారణమని విడుదలైన డిజిటల్ ఓషన్ నివేదిక పేర్కొంది. డెవలపర్‌లలో ఉద్యోగ సంతృప్తి తక్కువగా ఉండవచ్చని, అయితే ఆంట్రప్రెన్యూర్‌గా ఎదగాలనే కోరిక వారిలో ఎక్కువగా ఉందని ఉదహరించింది.

"ఇక చేస్తున్న ఉద్యోగానికి రిజైన్‌ చేసిన వారిలో 8 శాతం మంది తమ సొంత కంపెనీ ప్రారంభించి ఉపాధి కల్పించే లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నట్లు గుర్తించినట్లు ది ఓషన్‌ ప్రతినిధులు తెలిపారు. కాగా, బ్లాక్‌చెయిన్, వెబ్ 3 టెక్నాలజీల చుట్టూ సంచలనం ఉన్నప్పటికీ, సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లలో 67 శాతం మంది ఇంకా బ్లాక్‌చెయిన్/ వెబ్ 3ని ఉపయోగించడం లేదని పునరుద్ఘాటించారు.

మరిన్ని వార్తలు