న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 4.43 కోట్ల ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్లు) డిసెంబర్ 25 నాటికి దాఖలైనట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. ఇందులో ఒక్క డిసెంబర్ 25వ తేదీన 11.68 లక్షల రిటర్నులు దాఖలైనట్టు తెలిపింది. 2.41 కోట్ల ఐటీఆర్–1లు కాగా, 1.09 కోట్ల ఐటీఆర్–4లు ఉన్నట్టు వెల్లడించింది.
ఎస్ఎంఎస్లు, ఈ మెయిల్స్ ద్వారా పన్ను రిటర్నులు దాఖలు చేయాలంటూ పన్ను చెల్లింపుదారులకు గుర్తు చేస్తూనే ఉన్నామని ఆదాయపన్ను శాఖ ట్వీట్ చేసింది. జూలై 31 రిటర్నుల దాఖలుకు అసలు గడువు. కరోనా కారణంగా ప్రతికూలతలను దృష్టిలో ఉంచుకున్న కేంద్ర సర్కారు గతేడాది మాదిరే.. ఈ ఏడాది కూడా డిసెంబర్ ఆఖరు వరకు గడువును పొడిగించడం గమనార్హం.