5,000 మందికి రిలయన్స్‌ చేయూత.. ఒక్కొక్కరికీ రూ.2 లక్షల వరకు..

26 May, 2023 08:00 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న 5,000 మంది విద్యార్థులు రిలయన్స్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌లకు ఎంపికయ్యారు. 27 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల నుండి 2022–23 సంవత్సరానికి రిలయన్స్‌ ఫౌండేషన్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేయనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. ఎంపికైన అభ్యర్థులు రూ.2 లక్షల వరకు గ్రాంట్‌ని అందుకుంటారని వివరించింది.

స్కాలర్‌షిప్స్‌ అందుకునే విద్యార్థుల్లో ఇంజనీరింగ్‌/టెక్నాలజీ, సైన్స్, మెడిసిన్, కామర్స్, ఆర్ట్స్, బిజినెస్‌/మేనేజ్‌మెంట్, కంప్యూటర్‌ అప్లికేషన్స్, లా, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ, ఆర్కిటెక్చర్, ఇతర ప్రొఫెషనల్‌ డిగ్రీలకు చెందినవారు ఉన్నారు. స్కాలర్స్‌లో 51 శాతం మంది బాలికలు. 4,984 విద్యా సంస్థలలో చదువుతున్న దాదాపు 40,000 మంది దరఖాస్తుదారుల నుండి కఠినమైన ప్రక్రియ ద్వారా వీరి ఎంపిక జరిగింది. ఇందులో ఆప్టిట్యూడ్‌ టెస్ట్, 12వ తరగతి మార్కు లు, ఇతర అర్హత ప్రమాణాల ఆధారంగా అర్హుల జాబితా రూపొందింది. పదేళ్లలో 50,000 మందికి స్కాలర్‌షిప్స్‌ అందజేయనున్నట్టు రిలయన్స్‌ ఫౌండేషన్‌ 2022 డిసెంబర్‌లో ప్రకటించింది.

ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది..

మరిన్ని వార్తలు