యాపిల్‌ ఉద్యోగుల సంచలన నిర్ణయం, సీఈఓ టిమ్‌కుక్‌కు భారీ షాక్‌!

5 May, 2022 11:54 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌కు ఆ సంస్థ ఉద్యోగులు భారీ షాకిచ్చారు. యాపిల్‌ సంస్థ సీఈఓ టిమ్‌ కుక్‌ తెచ్చిన కొత్తపాలసీని 75శాతం మంది ఉద్యోగులు తిరస్కరించారు. ఇప్పుడీ ఉద్యోగుల నిర్ణయం టిమ్‌ కుక్‌ ఆందోళనకు గురి చేస్తుంది. 

కరోనా కారణంగా రెండేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఇతర రంగాలతో పాటు టెక్‌ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు స్వస్తి పలుకుతున్నాయి. కోవిడ్‌ సంక్షోభం నుంచి కోలుకొని ఆఫీస్‌లో కార్యకలాపాల్ని ముమ్మరం చేశాయి. దీంతో ఇంటికే పరిమితమైన ఉద్యోగుల్ని ఆయా టెక్‌ కంపెనీలు కార్యాలయాలకు ఆహ్వానిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్‌, ఇతర టెక్‌ దిగ్గజాలు తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలని మెయిల్స్‌ పెట్టగా..తాజాగా యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ సైతం మే23 నుంచి ఉద్యోగులు వారానికి 3 రోజులు ఆఫీస్‌ రావాలని మెయిల్స్‌లో పేర్కొన్నారు. 

అయితే ఆ మెయిల్‌ పై యాపిల్‌ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలకు రిజైన్‌ చేస్తాం. కానీ ఆఫీస్‌కు వచ్చేందుకు అంగీకరించేది లేమంటూ రహస్యంగా నిర్వహించిన సర్వేలో ఉద్యోగులు వారి అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. వరల్డ్‌ వైడ్‌గా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల్ని 'బ్లైండ్‌' అనే సంస్థ వెలుగులోకి తెస్తుంది. ఈ నేపథ్యంలో పేరు రహస్యంగా ఉంచిన ఓ సోషల్‌ మీడియా దిగ్గజ సంస్థ బ్లైండ్‌ భాగస్వామ‍్యంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 13 నుంచి ఏప్రిల్‌ 19 వరకు యాపిల్‌కు చెందిన 652 మంది ఉద్యోగల సమస్యలపై ఆరా తీసింది. ఈ సందర్భంగా యాపిల్‌ ఉద్యోగుల గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

" 2020 నుంచి ఇప్పటి వరకు (గత నెల ఏప్రిల్‌) వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఆఫీస్‌ రావాలని అంటున్నారు. ఆఫీస్‌కు వెళ్లలేం. సుదీర్ఘ కాలంగా ఇంట్లో ఉంటూనే ప్రొడక్టివ్‌గా పనిచేస‍్తున్నాం. యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ తమని వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు రావాలని మెయిల్స్‌ పెట్టారు. రిటర్న్‌ టూ ఆఫీస్‌ పాలసీని తప్పని సరిచేస్తే మా ఉద్యోగులకు రాజీనామా చేస్తాం. వర్క్‌ కంఫర్ట్‌ ఉన్న మరో సంస్థల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తామంటూ " బ్లైండ్‌ చేసిన అభిప్రాయ సేకరణలో 56శాతం ఉద్యోగులు తెలిపారు. మరో 75 శాతం మంది ఉద్యోగులు వ్యతిరేకించారు.          

వెర్జ్‌ సైతం
ప్రముఖ అమెరికన్‌ టెక్‌ బ్లాగ్‌ ది వెర్జ్‌ ఇప్పటికే యాపిల్‌ ఉద్యోగుల అసంతృప్తిపై పలు నివేదికల్ని వెలుగులోకి తెచ్చింది. గత డిసెంబర్‌ నెలలో పలు దేశాలకు చెందిన యాపిల్‌ స్టోర్‌ ఉద్యోగులు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు నివేదికల్లో పేర్కొంది. ముఖ్యంగా యాపిల్‌ సంస్థలో గంటల వ్యవధి పనిచేసే ఉద్యోగులపై పన్ను విధించడంపై అసంతృప్తిలో ఉన్నట్లు గుర్తు చేసింది. అట్లాంటాలోని యాపిల్‌ స్టోర్‌ ఉద్యోగులు..తమకు యాపిల్‌ సంస్థ పనికి తగ్గ వేతనం ఇవ్వాలంటూ ఇటీవల యూనియన్‌ ఎన్నికల్ని నిర్వహించాలని పట్టుబడిన విషయాన్ని ప్రస్తావించింది.

చదవండి👉చావు బతుకుల్లో నేహ భర్త.. కాపాడినందుకు టిమ్‌ కుక్‌కు థ్యాంక్స్‌!

మరిన్ని వార్తలు