ముగిసిన 5జీ స్పెక్ట్రం వేలం, టాప్‌ బిడ్డర్‌గా జియో.. కేంద్రానికి రూ.1.50 లక్షల కోట్ల ఆదాయం

1 Aug, 2022 17:59 IST|Sakshi

5జీ స్పెక్ట్రం వేలం ముగిసింది. ఏడురోజుల పాటు స్పెక్ట్రంకు సంబంధించిన వేలం కొనసాగింది. మొత్తం రూ.1,50,173 కోట్ల బిడ్లు దాఖలైనట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ బిడ్డింగ్‌లో 10‍కోట్లకు పైగా కనెక్షన్‌లు ఉన్న ఉత్తర్‌ ప్రదేశ్‌ ఈస్ట్‌ సర్కిల్‌కి స్పెక్ట్రం దక్కించుకునేందుకు సంస్థలు పోటీ పడడంతో వేలం మరో రోజు పొడిగింపు జరిగినట్లు తెలుస్తోంది. 

2022సంవత్సరానికి గాను 72గిగా హెడ్జ్‌ల రేడియా తరంగాలను వేలానికి పెట్టింది కేంద్రం. వీటి విలువ రూ.4.3లక్షల కోట్లుగా ఉంది. ఇందులో 600మెగా హెడ్జ్‌ నుంచి అత్యధికంగా 26 గిగా హెడ్జ్‌ల స్పెక్ట్రానికి సంబంధించి వేలం కొనసాగింది. జులై 26 నుంచి జరిగిన ఈ వేలం సోమవారం ముగియగా..గతంలో జరిగిన 3జీ, 4జీ స్ప్రెక్టం వేలం కంటే 5జీ స్పెక్ట్రం వేలం రికార్డ్‌ స్థాయిలో రూ.1,50,173కోట్లకు పైగా బిడ్లు దాఖలయ్యాయి. 

టాప్‌ బిడ్డర్‌గా జియో 
ఈ బిడ్డింగ్‌లో ముఖేష్‌ అంబానీ నేతృత్వం వహిస్తున్న రిలయన్స్‌ జియో టాప్‌ బిడ్డర్‌గా నిలిచింది. రెండో స్థానంలో ఎయిర్టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు తర‍్వాతి స్థానాల్లో నిలిచాయి. 5జీ స్పెక్ట్రం బిడ్డింగ్‌లో జియో రూ.80వేల 100కోట్లు, ఎయిర్టెల్‌ రూ.50వేల కోట్లుకు, ఐడియా వొడాఫోన్‌ రూ.15వేల కోట్లకు, తొలిసారి 5జీ స్పెక్ట్రం బిడ్డింగ్‌లో పాల్గొన్న అదానీ గ్రూప్‌ రూ.500కోట్లనుంచి రూ.1000 కోట్ల మధ్యలో పాల్గొంది.

మొత్తం 10బ్యాండ్‌లలో వేలం
మొత్తం 10బ్యాండ్‌లలో 72 జీహెచ్‌జెడ్‌ స్పెక్ట్రం వేలం వేయడం జరిగింది. 600mhz (మిలియన్ హెర్ట్జ్) 700 mhz, 800mhz, 900mhz, 1800mhz, 2100mhz, 2300mhz, 2500mhz తక్కువ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లు, మిడ్‌ రేంజ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ 3300 మెగా హెర్జ్‌తో పాటు హై ఫ్రీక్వెన్సీ 26 గాగా హెర్జ్‌ల వేలానికి ఉంచింది. మిడ్‌, హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లను టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు 4జీ కంటే 10రెట్లు వేగవంతమైన 5జీ సేవల కోసం వినియోగించుకుంటున్నాయి. కేంద్రం నిర్వహించిన వేలంలో తక్కువ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ కోసం ఎలాంటి బిడ్‌లు దాఖలు కాలేదు. కానీ 3,300 మెగా హెడ్జెట్‌, 22 గిగా హెడ్జెట్‌లకు ఎక్కువ బిడ్డింగ్‌లు వచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

జియోకే ఎక్కువ
స్పెక్ట్రం వేలంలో ఎక్కువ మొత్తాన్ని జియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో జరిగిన వేలంలో కేంద్రం భారీ ఆదాయాన్ని గడించింది. 3జీ వేలంలో రూ.50,968.37కోట్లకు, 4జీకి రూ.77,815 కోట్ల ఆదాయం రాగా.. ఆల్ట్రా హై స్పీడ్‌ మొబైల్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీ అందించేందుకు జరిగిన 5జీ వేలంలో మాత్రం అత్యధికంగా రూ.1,50,173కోట్ల ఆదాయం గడించింది. 

కేంద్రం షరతు.. అంతలోనే 
గతంలో జరిగిన ఈ 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు ఉత్సాహాం చూపించలేదు. స్పెక్ట్రం ఎంత వాడుకుంటే అంత మొత్తానికి యూసేజీ ఛార్జీలు చెల్లించాలని టెలింకాం కంపెనీలకు కేంద్రం షరతు విధించింది. కేంద్రం నిర్ణయంతో 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు టెలికాం కంపెనీలు ముందుకు రాలేదు.

ఇక తాజాగా జరిగిన 5జీ వేలంలో యూసేజీ ఛార్జీలను తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాదు బిడ్డింగ్‌ దక్కించుకున్న టెలికాం కంపెనీలకు 20 సంవత్సరాల లోపు దాఖలు చేసిన బిడ్డింగ్‌ మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించే వెసులు బాటు కల్పిస్తున్నట్లు పేర్కొంది. తాజా కేంద్రం నిర్ణయంతో ఈసారి జరిగిన 5జీ స్పెక్ట్రం బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు టెలికాం కంపెనీలు పోటీ పడ్డాయి.

>
మరిన్ని వార్తలు