దేశంలో 5జీ సేవలు,జాబ్‌ మార్కెట్‌లో జోష్‌!

10 Aug, 2022 07:44 IST|Sakshi

ముంబై: మాంద్యం, ద్రవ్యోల్బణ భయాలతో అంతర్జాతీయంగా రిక్రూట్‌మెంట్‌ మందగిస్తున్నప్పటికీ .. దేశీయంగా మాత్రం పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. చాలా నెలల పాటు అనిశ్చితిలో కొట్టుమిట్టాడిన జాబ్‌ మార్కెట్‌ ప్రస్తుతం స్థిరపడుతోంది. నియామకాలకు డిమాండ్‌ పుంజుకుంటోంది. 

తాము నిర్వహించే ఎంప్లాయ్‌మెంట్‌ ఇండెక్స్‌ (ఎంఈఐ)ప్రకారం నెలవారీగా జాబ్‌ పోస్టింగ్‌లు జులైలో ఒక్క శాతం పెరిగినట్లు కన్సల్టెన్సీ సంస్థ మాన్‌స్టర్‌డాట్‌కామ్‌ తెలిపింది. నామమాత్రం పెరుగుదలే అయినప్పటికీ ఉద్యోగాల మార్కెట్‌ కాస్త స్థిరపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించింది.

బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసులు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ), కెమికల్స్‌/ప్లాస్టిక్‌/రబ్బర్, పెయింట్లు, ఎరువులు/క్రిమి సంహారకాలు మొదలైన పరిశ్రమల్లో నియామకాలపై ఆసక్తి నెలకొంది. ఇక పెరుగుతున్న డిజిటైజేషన్, 5జీ సర్వీసులను ప్రవేశపెట్టనుండటం వంటి అంశాల నేపథ్యంలో టెలికం రంగంలోనూ హైరింగ్‌ జోరు కనిపించింది. పండుగ సీజన్‌ వస్తుండటంతో రిటైల్‌ రంగంలోనూ నియామకాలకు డిమాండ్‌ నెలకొన్నట్లు సంస్థ సీఈవో శేఖర్‌ గరిశ తెలిపారు.

చదవండి👉 5జీ మాయాజాలం: ఎయిర్‌టెల్‌ వర్సెస్‌ జియో..వెయ్యి నగరాల్లో!

మరిన్ని వార్తలు