5G Services In India: దేశంలో 5జీ, జియో నెట్‌వర్క్‌ యూజర్లకు శుభవార్త!

2 Aug, 2022 15:11 IST|Sakshi

5జీ స్పెక్ట్రం వేలం ముగిసింది. ఏడురోజుల పాటు జరిగిన బిడ్డింగ్‌లో మొత్తం రూ.1,50,173కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలుకు బిడ్లు దాఖలైనట్లు టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఆగస్ట్‌ 10కల్లా స్పెక్ట్రం కేటాయింపులు జరుపుతామని తెలిపారు. దీంతో మనిషి జీవన విధానాన్ని సమూలంగా మార్చే 5జీ సేవలు త్వరలో ప్రారంభం కానుండగా..తొలిసారి జియో 5జీ నెట్‌ వర్క్‌ సేవల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలుస్తోంది.  

స్పెక్ట్రం వేలం ముగియడంతో దేశీయ టెలికాం కంపెనీలు 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. పలు నివేదికల ప్రకారం..ఈ ఏడాది అక్టోబర్‌లో 5జీ నెట్‌ వర్క్‌లను వినియోగదారులకు అందించేందుకు మూడు సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సదరు సంస్థలు 5జీ నెట్‌ వర్క్‌ నిర్మాణ పనుల్ని పూర్తి చేశాయని టెస్ట్‌లతో పాటు ట్రయల్స్‌ నిర్వహించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.  

ఫస్ట్‌ జియోనే   
టెలికాం రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న రియలయన్స్‌ జియో దేశంలో తన 5జీ సేవల్ని వినియోగదారులకు అందించనుంది. ఇందుకోసం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పూణే, జామ్‌నగర్‌ నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ పనితీరుపై ట్రయల్స్‌ నిర్వహించినట్లు సంస్థ వార్షిక ఫలితాల విడుదల సందర్భంగా రియలన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రెసిడెంట్‌ కిరణ్‌ థామస్‌ తెలిపారు.


5జీపై టెలికాం కంపెనీలు 

రిలయన్స్‌ జియో ఛైర్మన్‌ ఆకాష్‌ ఎం అంబానీ మాట్లాడుతూ పాన్‌ ఇండియా అంతటా 5జీ సేవల్ని అందుబాటులోకి తెస్తాం. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాన్ని సెలబ్రేట్‌ చేసుకుందాం' అని అన్నారు. 

దేశంలో పలు ప్రధాన నగరాల నుంచి దశల వారీగా 5జీ సేవల్ని అందుబాటులోకి తెస్తామని ఎయిర్టెల్‌ తెలిపింది

ఇప్పుడే బిడ్డింగ్‌ ముగిసింది. 4జీ  నెట్‌ వర్క్‌ను పటిష్టం చేసి 5జీని అందుబాటులోకి తెస్తామని వొడాఫోన్‌ ఐడియా చెప్పింది. 

మార్కెట్‌ మొత్తం మీద 7శాతం స్మార్ట్‌ ఫోన్‌లలో మాత్రమే 5జీ నెట్‌ వర్క్‌ను వినియోగించుకోవచ్చు. అందుకే టెలికాం కంపెనీలు ప్రధాన నగరాల నుంచి దశల వారీగా 5జీ నెట్‌ వర్క్‌లను విస్తరిస్తాయిని నోమురా తన నివేదికలో పేర్కొంది.  

మరిన్ని వార్తలు