38 మిలియన్లకు చేరనున్న 5జీ స్మార్ట్‌ఫోన్లు..!

22 Jan, 2021 10:19 IST|Sakshi

ఈ ఏడాది 9 రెట్లు పెరగనున్న 5జీ స్మార్ట్‌ఫోన్లు

న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్లు తొమ్మిది రెట్లు పెరిగి.. 38 మిలియన్లకు చేరుతాయని రీసెర్చ్‌ సంస్థ కౌంటర్‌పాయింట్‌ అంచనా వేసింది. వన్‌ప్లస్, యాపిల్‌ వంటి బ్రాండ్‌ ఫోన్లు బలమైన పోర్ట్‌ఫోలియోను నమోదు చేస్తుండటమే ఈ వృద్ధికి కారణమని పేర్కొంది. గతేడాది మూడో త్రైమాసికంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగించిన అనంతరం దేశంలో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ వేగంగా కోలుకుంటుందని తెలిపింది. ఎగుమతుల పరంగా గతేడాది సెప్టెంబర్‌ క్వాటర్‌లో డిమాండ్, కొత్త యూజర్లు, పెరగడంతో అత్యుత్తమ మార్కెట్‌ను నమోదు చేసింది. 2020 క్యూ1లో దేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్ల ప్రారంభమయ్యాయి. అధిక ధరలు, పరిమిత 5జీ నెట్‌వర్క్‌ వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపింది. గతేడాది ఆగస్టులో వన్‌ప్లస్‌ నుంచి మిడ్‌ ప్రైస్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌తో పరిస్థితుల్లో మార్పులు కనిపించాయని పేర్కొంది.
(చదవండి: డక్‌డక్‌గో.. గూగుల్‌కు పోటీ ఉందా?)

2020 చివరి నాటికి 4 మిలియన్లకు...
గతేడాది సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 1.7 మిలియన్లుగా ఉన్న 5జీ ఎగుమతులు 2020 చివరి నాటికి 4 మిలియన్లకు చేరుకున్నాయని తెలిపింది. వన్‌ప్లస్, యాపిల్‌ రెండు బ్రాండ్ల ఎగుమతులే జరిగాయి. 100 శాతం 5జీ పోర్ట్‌ఫోలియో ఉన్న ఏకైక బ్రాండ్‌ వన్‌ప్లస్‌. ఐ–ఫోన్‌ 12 సిరీస్‌ను 5జీతో ప్రారంభించింది. గతేడాది జనవరి–నవంబర్‌ మధ్య కాలంలో దేశంలో విక్రయమైన 5జీ స్మార్ట్‌ఫోన్లలో 89 శాతం వాటా రూ.20 వేల లోపు ధర ఉన్న ఫోన్లే అని కౌంటర్‌పాయింట్‌ తెలిపింది. ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫాక్చరర్‌ (ఓఈఎం)లకు చవకైన 5జీ చిప్‌సెట్ల లభ్యతతో ధరలు తగ్గుతాయని పేర్కొంది. ప్రస్తుతం అఫర్డబుల్‌ 5జీ చిప్‌సెట్లను క్వాల్‌కమ్, మీడియాటెక్‌లు ఆవిష్కరించాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి దేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్ల ధరలు రూ.15 వేలకు చేరుతాయని అంచనా వేసింది.  

మరిన్ని వార్తలు