5g Smartphone Sales: దూసుకెళ‍్తున్న అమ్మకాలు

21 Aug, 2021 07:26 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు జోరుగా ఉంటాయని కౌంటర్‌పాయింట్‌ రిసెర్చ్‌ అంచనా వేస్తోంది. విక్రయాలు 14 శాతం అధికమై 17.3 కోట్ల యూనిట్లకు చేరతాయని వెల్లడించింది. జూలై–డిసెంబరు కాలంలోనే 10 కోట్లకుపైగా స్మార్ట్‌ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లనున్నాయి. కోవిడ్‌–19 పరిమితులు ఎత్తివేసిన తర్వాత జూన్‌ మొదలుకుని కస్టమర్ల నుంచి డిమాండ్‌ ఉంది. 

ఆగస్ట్‌–నవంబర్‌ మధ్య అమ్మకాల హవా ఉంటుంది. చైనా తర్వాత స్మార్ట్‌ఫోన్ల రంగంలో భారత్‌ ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. ఫీచర్‌ ఫోన్ల నుంచి వినియోగదార్లు అప్‌గ్రేడ్‌ అవుతున్నారు. ప్రస్తుతం దేశంలో 32 కోట్ల మంది ఫీచర్‌ ఫోన్లను వాడుతున్నారు. ఇక కొన్నేళ్లలోనే స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ 20 కోట్ల మార్కును దాటనుంది. 2019లో దేశంలో 15.8 కోట్ల స్మార్ట్‌ఫోన్లు విక్రయమయ్యాయి. గతేడాది స్వల్పంగా 4 శాతం తగ్గి 15.2 కోట్ల యూనిట్లు నమోదయ్యాయి.

అంచనాలను మించి..: సెకండ్‌ వేవ్‌ వచ్చినప్పటికీ అంచనాలను మించి మార్కెట్‌ వేగంగా పుంజుకుంది. 2021 జనవరి–జూన్‌ కాలంలో అత్యధిక అమ్మకాలను సాధించింది. కోవిడ్‌ కేసులు నియంత్రణలో ఉండి, వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కస్టమర్లలో సెంటిమెంట్‌ బలపడుతుందని టెక్నోవిజన్‌ ఎండీ సికందర్‌ తెలిపారు. కాగా, 2020లో 5జీ మోడళ్ల వాటా కేవలం 3 శాతమే. ఈ ఏడాది ఇది 19 శాతం వాటాతో 3.2 కోట్ల యూనిట్లను తాకనుంది. 5జీ చిప్‌సెట్‌ చవక కావడం, స్మార్ట్‌ఫోన్ల ధర తగ్గడంతో ఈ విభాగంలో అమ్మకాలు దూసుకెళ్లనున్నాయి. ఎంట్రీ లెవెల్‌లో సగటు ధర ఏడాదిలో 40 శాతం తగ్గింది. ప్రస్తుతం రూ.15,000లోపు ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ లభిస్తోంది.  

చదవండి: 'మాధవ్‌ సార్‌ ఇంకా ఎన్నిరోజులు మమ్మల్ని కాపీ కొడతారు'

మరిన్ని వార్తలు