మెజారిటీ ప్రజల్లో ఆర్థిక అభద్రత

8 Nov, 2022 06:05 IST|Sakshi

69 శాతం మంది అభిప్రాయం ఇదే

సగటు ఆదాయం రూ.23,000

మనీ 9 సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: ఆర్థిక సేవల విస్తృతి పెరిగినప్పటికీ, దేశంలో మెజారిటీ ప్రజల్లో ఆర్థిక అభద్రతా భావం నెలకొని ఉన్నట్టు మనీ 9 సర్వే ప్రకటించింది. ‘‘ఒక భారతీయ కుటుంబం (4.2 మంది) సగటు ఆదాయం నెలకు రూ.23,000గా ఉంది. కానీ, 46 శాతం కుటుంబాల వాస్తవిక ఆదాయం నెలకు రూ.15,000 కంటే తక్కువే ఉంది. జీవన పమ్రాణాల పరంగా దేశంలో కేవలం 3 శాతం కుటుంబాలే ఉన్నత విభాగంలో ఉన్నాయి. వీటిల్లో అధిక భాగం ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాలకు చెందినవి’’ అని ఈ సర్వే నివేదిక తెలియజేసింది.  

ఇతర అంశాలు..
► 70 శాతం కుటుంబాలకు బ్యాంకు డిపాజిట్లు, బీమా, పోసాŠట్‌ఫీసు పొదుపు, బంగారం రూపంలో పెట్టుబడులు ఉన్నాయి. అత్యధికంగా వీరి పొదుపు ఉన్నది బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే. ఆ తర్వాత పోస్టాఫీసు పొదుపు పథకాలు, జీవిత బీమా, బంగారంలో వరుసగా ఉన్నాయి.
► 64 శాతం కుటుంబాలు బ్యాంకు డిపాజిట్లలో పెట్టుబడులు కలిగి ఉంటే, 19 శాతం కుటుంబాలకు జీవిత బీమా రూపంలో పెట్టుబడులు ఉన్నాయి.
► ఔత్సాహిక వర్గాల్లో 40 శాతం కుటుంబాలకు అసలు ఆర్థిక పొదుపులే లేవు. విధాన కర్తలు దీనిపై దృష్టి సారించాలన్నది ఈ సర్వే సూచనగా ఉంది.
► 22 శాతం కుటుంబాలకు స్టాక్స్, మ్యూచువల్‌ ఫండ్స్, యులిప్‌లు, భౌతిక ఆస్తుల్లో (ప్రాపర్టీ తదితర) పెట్టుబడులు ఉన్నాయి.  
► ప్రాపర్టీలు/భూములపై అత్యధికంగా 18 శాతం, మ్యూచువల్‌ ఫండ్స్‌లో 6 శాతం, స్టాక్స్‌లో 3 శాతం, యులిప్‌లలో 3 శాతం చొప్పున ఉన్నాయి.
► 11 శాతం కుటుంబాలు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల నుంచి రుణాలు తీసుకుని ఉన్నాయి. వీటిల్లో వ్యక్తిగత రుణాలు ఎక్కువ కాగా, ఆ తర్వాత గృహ రుణాలున్నాయి.

మరిన్ని వార్తలు