కెరీర్‌ పట్ల పునరాలోచన

19 Jan, 2022 03:05 IST|Sakshi

మెరుగ్గా ఉంటే వేరే వృత్తి అయినా ఓకే 

71 శాతం మంది అభిప్రాయం 

కరోనాతో మారిన ప్రాధాన్యతలు 

జాబ్‌సైట్‌ ఇండీడ్‌ సర్వే వెల్లడి 

ముంబై: ఉద్యోగ మార్కెట్‌పై కరోనా మహమ్మారి ప్రభావం చూపించడం.. ఉద్యోగులు తమ ప్రాధాన్యతలను పునర్‌నిర్వచించుకునేలా చేసినట్టు జాబ్‌ పోర్టల్‌ ఇండీడ్‌ తెలిపింది. 71 శాతం ఉద్యోగులు కెరీర్‌ పట్ల పునరాలోచన చేస్తున్నారని.. మెరుగ్గా అనిపిస్తే భిన్నమైన కెరీన్‌ను చేపట్టే ఆలోచనతో ఉన్నట్టు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా లేబర్‌ మార్కెట్‌పై కరోనా మహమ్మారి ప్రభావం పడినట్టు తెలిపింది.  

♦2021 ద్వితీయ ఆరు నెలల్లో నియామకాల ధోరణిపై  ఇండీడ్‌ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో 1,219 ఉద్యోగ సంస్థలు, 1,511 మంది ఉద్యోగులు తమ అభిప్రాయాలు తెలియజేశారు.  

♦51% మంది ఉద్యోగులు ప్రస్తుత ఉద్యోగంలో ప్రయోజనం ఉందా? అని ప్రశ్నంచుకుంటుంటే, సరైన ఉద్యోగంలోనే ఉన్నామా? అని 71% మంది ప్రశ్నించుకుంటున్నట్టు సర్వేలో చెప్పారు.  

♦జీవిత అవసరాలకు అనుగుణంగా తమ ఉద్యోగాన్ని మార్చుకునే ఆలోచనతో ఉన్నట్టు 61 శాతం మంది చెప్పారు.  

♦ప్రతి పది 10 మందిలో ముగ్గురు తమ ఉద్యోగాలను వీడాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇలాం టి ఆలోచన మహిళల్లో 19 శాతమే ఉంటే, పురుష ఉద్యోగుల్లో 31 శాతంగా ఉంది. 

♦కరోనా ఉద్యోగుల ప్రాధాన్యతల్లో మార్పునకు బీజం వేసింది. 68 శాతం మంది ఉద్యోగంలో సంతృప్తే తమకు ముఖ్యమని చెప్పారు. 

♦62 శాతం మంది వేతనానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు పేర్కొన్నారు. 

♦77 శాతం మంది చేస్తున్న పని ప్రదేశంలో సౌకర్యంగా లేదని తెలిపారు. 

మరిన్ని వార్తలు