15 రోజులు.. 91 టెక్‌ కంపెనీల్లో 24 వేల మంది ఉద్యోగుల తొలగింపు!

16 Jan, 2023 19:04 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం భయాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ భయాలు భారత్‌లో ఎక్కువగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికల్ని ఉటంకిస్తూ.. ఉద్యోగుల తొలగింపుల్ని ట్రాక్‌ చేసే సంస్థ లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ. తాజాగా ఈ ఏడాదిలో అంటే జనవరి 1 నుంచి జనవరి 16 వరకు 91 సంస్థలు సుమారు 25,151 మందిని తొలగించినట్లు తెలిపింది. ఆ సంస్థలో అమెజాన్‌,సేల్స్‌ఫోర్స్‌, కాయిన్‌బేస్‌ తో పాటు ఇతర కంపెనీలున్నాయి. 

క్రిప‍్టో ఎక్ఛేంజ్‌ క్రిప్టో.కామ్‌ గత వారంలో ప్రపంచ వ్యాప్తంగా 20 శాతం మంది సిబ్బందిని తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఓలా (200 మంది ఉద్యోగులను తొలగించింది), వాయిస్ ఆటోమేటెడ్ స్టార్టప్ స్కిట్‌.ఏఐ వంటి కంపెనీలు జనవరిలో భారీ ఎత్తున ఉద్యోగుల్ని ఫైర్‌ చేశాయి.

లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ ప్రకారం..2022లో మెటా,ట్విటర్,ఒరాకిల్,ఎన్విడియా,స్నాప్,ఉబెర్,స్పాటిఫై,ఇంటెల్,సేల్స్‌ఫోర్స్‌ సంస్థలు 153,110 మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు జారీ చేశాయి.నవంబర్‌లో ఉద్యోగుల తొలగింపుల సంఖ్య తారాస్థాయికి  చేరుకున్నట్లు నివేదించింది. ఒక్క నెలలోనే 51,489 మంది టెక్కీలు ఉపాధి కోల్పోయారు. మరో టెక్ దిగ్గజం గూగుల్‌ ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగుల్ని తగ్గించేలా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఈ వరుస లేఆఫ్స్‌తో 2023 సైతం టెక్నాలజీ రంగంలో గడ‍్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ నెలాఖరులో టెక్ రంగ సంస్థలు త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయోనని జాబ్‌ మార్కెట్‌ నిపుణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు