Ration Card Aadhaar Linking: రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త.. వాటి లింక్ గడువు పొడిగింపు!

25 Mar, 2022 16:52 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డు కలిగిన వారికి శుభవార్త అందించింది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనుసంధానానికి గడువును పొడిగించింది. దీంతో, ఇంకా ఆధార్ కార్డుతో లింక్ కానటువంటి రేషన్ కార్డుదారులకు కూడా రేషన్ సరుకులు లభించనున్నాయి. దీని వల్ల చాలా మందికి ఊరట కలగనుంది. ఆధార్ కార్డులను రేషన్ కార్డుతో అనుసంధానించే గడువును ప్రభుత్వం మార్చి 31 నుంచి జూన్ 30 వరకు పొడగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 

కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారుల సౌలభ్యం కోసం పలు రకాల నిర్ణయాలు తీసుకుంటుంది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం కూడా ఇందులో భాగమనే చెప్పుకోవచ్చు. దీని వల్ల లక్షల మందికి ప్రయోజనం కలుగుతోంది. మరీ ముఖ్యంగా వలస కూలీలకు, కార్మికులకు ఈ పథకం వల్ల ప్రయోజనం లభిస్తోంది. దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు పొందొచ్చు. అయితే ఈ ప్రయోజనాలు పొందాలని భావించే వారు కచ్చితంగా రేషన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలి. అధికారిక నివేదికల ప్రకారం, ఈ పథకం కింద 80 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఫిబ్రవరి మధ్య నాటికి, 96 శాతం మంది లబ్ధిదారులు ఓఎన్‌ఓఆర్‌సీ కింద నమోదు చేసుకున్నారు. ఆధార్-రేషన్ కార్డు లింక్ గడువును డిసెంబర్ 31, 2021 నుంచి మార్చి 31, 2022 వరకు పొడిగించారు. ఇప్పుడు, మరల కేంద్రం జూన్ 30, 2022 వరకు పొడగించింది.

(చదవండి: కలిసొచ్చిన రష్యా-ఉక్రెయిన్‌ వార్‌..! తొలిసారి టాప్‌-5 క్లబ్‌లోకి భారత్‌..!)

మరిన్ని వార్తలు