‘వెనక ఇంత జరిగిందా’.. ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ!

8 Nov, 2022 18:35 IST|Sakshi

ఐటీలో రోజుకో అంశం తెరపైకి వచ్చి కలకలం రేపుతోంది. నిన్నటి వరకు మూన్‌లైటింగ్‌, వర్క్‌ ఫ్రం హోమ్‌పై చర్చ నడవగా, తాజాగా ఫేక్‌ ఎక్స్‌పీరియన్స్‌తో ఉద్యోగాలు పొందుతున్నారనే అంశం తెరపైకి వచ్చింది. తాజగా ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ యాక్సెంచర్ తమ నియామక ప్రక్రియలో కంపెనీని తప్పుదారి పట్టించిన ఉద్యోగులపై వేటు వేసింది. సంస్థలో ఉద్యోగం పొందడానికి న‌కిలీ ఎక్స్‌పీరియ‌న్స్ లెట‌ర్‌, ఇత‌ర త‌ప్పుడు ప‌త్రాల‌ను ఉపయోగించిన ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ తెలిపింది.

ఆ ఉద్యోగులపై వేటు.. 
యాక్సెంచర్ కంపెనీ క‌ఠిన వాణిజ్య నైతిక విలువ‌ల‌ను అనుస‌రిస్తుందని, కంపెనీ నియమ, నిబంధలను పాటించని వారిపై వేటు తప్పదని ఓ ప్రకటనలో స్ప​ష్టం చేసింది. నియామక ప్రక్రియ సమయంలో నకిలీ పత్రాలను ఉపయోగించి కొం‍దరు ఉద్యోగాలు పొందారన్న విషయం తెలియడంతో వారిని తొలగించింది. అయితే అలా పని చేస్తున్నా వారిలో ఎంత మంది ఉద్యోగులను తొలగించారన్న దానిపై యాక్సెంచర్‌ పూర్తి వివరాలు తెలపాల్సి ఉంది.

వీటితో పాటు మరో అంశంపై స్పందిస్తూ.. నకిలీ జాబ్ పోస్టుల పట్ల అభ్యర్థులు జాగ్రత్త వహించాలని సూచించింది. యాక్సెంచర్‌లో ఉద్యోగం కోసం కొన్ని ఎంప్లాయిమెంట్‌ ఏజెన్సీలు, కొందరు వ్యక్తులు ఉద్యోగార్థుల వద్ద డబ్బు అడుగుతున్నారని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది.

వాటిని నమ్మకండి
యాక్సెంచ‌ర్‌లో ఉద్యోగం ఇచ్చే క్ర‌మంలో డ‌బ్బు వ‌సూలు చేయాల‌ని తాము ఏ సంస్ధ‌కు, వ్య‌క్తికి అధికారం ఇవ్వ‌లేద‌ని తేల్చిచెప్పింది. న‌కిలీ జాబ్ ఆఫ‌ర్ల ప‌ట్ల అభ్య‌ర్ధులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని బ్లాగ్ పోస్ట్‌లో హెచ్చ‌రించింది. యాక్సెంచ‌ర్‌లో జాబ్ కోసం ఏ ఒక్క‌రూ డ‌బ్బు చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపింది. తమ సంస్థలో నియామకం కేవలం మెరిట్ ఆధారంగానే జరుగుతుందని, ఉద్యోగాల కోసం ఎవరూ ఎప్పుడూ చెల్లించాల్సిన అవసరం లేదని స్ప​ష్టం చేసింది.

చదవండి: Dropout Chaiwala: విదేశాలలో చదువు మానేసి.. కాఫీలు, టీలు అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నాడు!

మరిన్ని వార్తలు