హైదరాబాద్‌లో అద్దెలు పెరిగాయ్‌, సగం జీతం.. ఇంటి అద్దెకే!

8 Oct, 2022 09:19 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: విద్యా సంస్థలు, కార్యాలయాల పునఃప్రారంభంతో అద్దె గృహాలకు గిరాకీ పెరిగింది. దీంతో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో లగ్జరీ ఇళ్ల నెలవారీ అద్దెలలో తొలిసారిగా రెండంకెల వృద్ధి నమోదయింది. కరోనా కంటే ముందు ప్రీమియం ప్రాపర్టీల రెంట్లు 5–7 శాతం వృద్ధిని నమోదవుతుండగా.. గత రెండేళ్లలో ఏకంగా 18 శాతం పెరిగాయని అనరాక్‌ సర్వేలో తేలింది.

ప్రధాన ప్రాంతాలలో డిమాండ్‌కు తగిన లగ్జరీ గృహాల సప్లయి లేకపోవటమే అద్దె పెరుగుదలకు కారణం. అలాగే కరోనా తర్వాతి నుంచి అద్దెదారులు పెద్ద సైజు గృహాల అద్దెలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఫలితంగా అందుబాటుతో పోల్చితే లగ్జరీ ప్రాపర్టీల రెంట్లు పెరిగాయని సర్వే వెల్లడించింది. 

అత్యధికంగా ముంబైలోని వర్లీలో 18 శాతం మేర అద్దెలు పెరిగాయి. ఇక్కడ 2020లో 2 వేల చ.అ ఇంటి అద్దె రూ.2 లక్షలుగా ఉండగా.. 2022 నాటికి రూ.2.35 లక్షలకు పెరిగింది. టార్డియోలో రెండేళ్ల క్రితం రూ.2.70 లక్షలుగా ఉన్న అద్దె.. ఇప్పుడు 15 శాతం పెరిగి రూ.3.10 లక్షలకు చేరింది.  

బెంగళూరులోని జేపీ నగర్‌లో 13 శాతం వృద్ధితో రూ.46 వేల నుంచి రూ.52 వేలకు, రాజాజీనగర్‌లో 16 శాతం వృద్ధితో రూ.56 వేల నుంచి రూ.65 వేలకు అద్దెలు పెరిగాయి. రాజాజీనగర్‌ అత్యధిక మూలధన విలువను సాధించిన ప్రాంతంగా నిలిచింది. చ.అ. ధర రూ.5,698 నుంచి 9 శాతం వృద్ధి రేటుతో రూ.6,200లకు పెరిగింది. 

చెన్నైలోని కొత్తూరుపురంలో 14 శాతం 

వృద్ధితో రూ.74 వేల నుంచి రూ.84 వేలకు, కోల్‌కత్తాలోని బల్లీగంజ్‌లో 10 శాతం పెరుగుదలతో రూ.88 వేల నుంచి రూ.97 వేలకు, ఎన్‌సీఆర్‌లోని గోల్ఫ్‌కోర్స్‌ ఎక్స్‌టెన్షన్‌ రోడ్‌లో 12 శాతం వృద్ధితో రూ.50 వేల నుంచి రూ.56 వేలకు, పుణేలోని కోరాగావ్‌ పార్క్‌లో 14 శాతం వృద్ధితో రూ.59,500ల నుంచి రూ.68 వేలకు నెలవారీ అద్దెలు పెరిగాయి. 

జూబ్లీహిల్స్‌లో 62 వేలు..
హైదరాబాద్‌లో లగ్జరీ గృహాల అద్దెలకు డిమాండ్‌ పెరిగింది. రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో 2 వేల చ.అ. ఇంటి అద్దె రూ.54 వేలుగా ఉండగా.. 2022 నాటికి 15 శాతం మేర పెరిగి రూ.62 వేలకు చేరింది. అలాగే హైటెక్‌సిటీలో 2020లో రూ.53 వేలుగా ఉన్న రెంట్‌.. ప్రస్తుతం 11 శాతం వృద్ధితో రూ.59 వేలకు పెరిగింది. అలాగే జూబ్లీహిల్స్‌లో 2020లో చ.అ. సగటు ధర రూ.6,950గా ఉండగా.. 2022 నాటికి 6 శాతం వృద్ధి రేటుతో రూ.7,400లకు పెరిగింది. హైటెక్‌సిటీలో రెండేళ్ల క్రితం చ.అ.కు రూ.5,675గా ఉండగా.. ప్రస్తుతం 7 శాతం పెరుగుదలతో రూ.6,100లకు చేరింది.

చదవండి👉 లబోదిబో.. హైదరాబాద్‌లో పెరిగిపోతున్న అమ్ముడు పోని ఇళ్లు

మరిన్ని వార్తలు