డబ్బులు లేక, ఆగిన 1.74 లక్షల గృహాల నిర్మాణం

4 Aug, 2021 09:10 IST|Sakshi

న్యూఢిల్లీ: నిర్మాణ రంగానికి నిధుల కొరత నెలకొన్న నేపథ్యంలో పలు భారీ హౌసింగ్‌ ప్రాజెక్టులు నిల్చిపోయాయి. దేశీయంగా హైదరాబాద్‌ సహా ఏడు ప్రధాన నగరాల్లో 1.74 లక్షల గృహాల నిర్మాణం ఆగిపోయింది. వీటి విలువ సుమారు రూ. 1.4 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

2014, అంతకన్నా ముందు మొదలుపెట్టిన ప్రాజెక్టులను దీనికి పరిగణనలోకి తీసుకున్నారు. నిల్చిపోయినవే కాకుండా జాప్యం జరుగుతున్న వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం సంఖ్య 6,28.630గా ఉంటుందని పేర్కొంది. వీటి విలువ సుమారు రూ. 5,05,415 కోట్లుగా వివరించింది. నిర్మాణ రంగాన్ని నిధుల కొరత సమస్య వెంటాడున్నందున.. పూర్తిగా నిల్చిపోయిన ప్రాజెక్టుల్లో కొనుగోళ్లు చేసిన వారికి భవిష్యత్‌ అంచనాలు అత్యంత విపత్కరంగా ఉన్నాయని తెలిపింది. భారీ జాప్యమున్న ప్రాజెక్టుల్లో కొనుగోలుదారులకూ పరిస్థితి  ఆశావహంగా లేవని పేర్కొంది.  

ఢిల్లీలో అత్యధికం .. 
నగరాలవారీగా చూస్తే హైదరాబాద్‌లో సుమారు రూ. 2,727 కోట్ల విలువ చేసే 4,150 యూనిట్ల నిర్మాణం నిల్చిపోయింది. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ (నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌)లో అత్యధికంగా రూ. 86,463 కోట్ల విలువ చేసే 1,13,860 యూనిట్ల నిర్మాణం నిల్చిపోయింది. ఇది మొత్తం టాప్‌ 7 నగరాల్లో నిల్చిపోయిన వాటిలో 66 శాతం కావడం గమనార్హం. అటు ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌)లో 41,730 యూనిట్లు (విలువ రూ. 42,417 కోట్లు), పుణెలో 9,900 యూనిట్లు (విలువ రూ. 5,854 కోట్లు), బెంగళూరులో 3,870 యూనిట్లు (విలువ రూ. 3,061 కోట్లు), కోల్‌కతాలో 150 ఫ్లాట్ల (విలువ రూ. 91 కోట్లు) నిర్మాణం ఆగిపోయింది. ఇక, నిల్చిపోయిన వాటితో పాటు జాప్యం జరుగుతున్న వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే హైదరాబాద్‌లో రూ. 11,810 కోట్ల విలువ చేసే 17,960 యూనిట్లు ఉన్నాయి.   

మరిన్ని వార్తలు